హైదరాబాద్ : ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల పునరుద్ధరణ, సంరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణకు హరితహారం కింద అద్భుత ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా హరితయజ్ఞంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
అడవుల పరిరక్షణ ఆవశ్యకత అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో, జనంలో చైతన్యం రావాలని మార్చి 21ని ప్రపంచ అటవీ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. తొలిసారిగా 2014న విశ్వవ్యాప్తంగా అటవీ దినోత్సవం పాటించారు. మానవుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతో అవసరమని తెలుపడమే ప్రపంచ అటవీ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.