–కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి వెళ్లే సంగారెడ్డి కెనాల్పై 6.25 కిలోమీటర్ వద్ద ఓటీ
-దీని ద్వారా బంధం చెరువు, పెద్దచెరువు, అంబర్పేటఖాన్ చెరువులకు నీటి మళ్లింపు
-అక్కడి నుంచి 5.5 కిలోమీటర్ల మేర కాలువ ద్వారా హల్దీవాగులోకి జలాలు
–హల్దీవాగు నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుదూరం.. సుమారు 96 కిలోమీటర్లు
–హల్దీవాగుపై ఉన్న చెక్డ్యాంలు 39, నీటి సామర్థ్యం 0.621 టీఎంసీలు
అనేకానేక పిల్ల కాలువలు, వాగులు, వంకలు, ఉప నదుల సంగమం జీవనది. అలాంటి జీవనది అవే కాలువలు, వాగులు వంకల్లో ప్రవహిస్తూ ఉపనదిని సంగమిస్తే అది అద్భుతం. పల్లానికి పారుతూ సముద్రుడిని చేరాల్సిన నదీ జలాలు ఎగువకు ఎదురెక్కి తన దిశను మార్చుకుంటే అది మహాద్భుతం. ఈ అద్భుతం.. మహాద్భుతాలను మించి అనేక అత్యుద్భుతాలను సాకారం చేసింది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. వందల కిలోమీటర్లు ప్రవహించి, అర కిలోమీటర్కుపైగా ఎదురెక్కి కొండపోచమ్మను చేరిన గోదారమ్మ.. హల్దీవాగు వారధిగా మంజీరతో సంగమించేందుకు సిద్ధమవుతున్నది.
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ నిరంతర కృషితో రూపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు ఎండిన వాగులు, చెక్డ్యాంలు, చెరువుల మత్తడులు దుంకడమే లక్ష్యంగా.. అడుగంటిన రిజర్వాయర్లను నింపడమే ఆశయంగా.. బీడువారిన పొలాల దూప తీర్చడమే తపనగా ఎదురెక్కుతున్నాయి. సుదూరం నుంచి వచ్చి కొండపోచమ్మ జలాశయం చేరిన కాళేశ్వరం జలాలు అక్కడా సేద తీరకుండా.. సీఎం కేసీఆర్ నేర్పిన నడక సాక్షిగా సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగు చేరి మరోసారి తన దిశను మార్చుకోనున్నాయి. మండుటెండల్లోనూ మంజీరకు జీవం పోస్తూ నిజాంసాగర్కు చేరనున్నాయి.
నిను కరగించి తెచ్చిన పునీతు
డెవం? డతనిన్ భగీరథుం
డనవలె; వాడు నా తెలుగు
టంగణమందలి ముండ్ల దుబ్బులన్
తునియలు కొట్టి ఈ చెరకు
తోటల గూర్చి హలమ్ము గ్రుమ్మి, భూ
మిని ప్రసవింపజేసి పసిమిన్
మిసిమిన్ పెకలించె దండిగా
-దాశరథి
గోదారితో గోదావరి సంగమం
మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వత శ్రేణుల్లో పుట్టిన గోదావరి ఉపనది మంజీర.. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం గౌడ్గావ్ జన్వాడ వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి రాష్ట్రంలో సుమారు 250 కిలోమీటర్లు ప్రవహించి నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద మరో ఉపనది హరిద్రతో త్రివేణి సంగమంగా గోదావరిలో కలుస్తుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ నుంచి దాదాపు 250 కిలోమీటర్లు ఎదురెక్కి 618 అడుగుల ఎత్తులోని కొండపోచమ్మకు గోదావరి జలాలు చేరుతున్నాయి. అక్కడి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వద్ద తన ఉపనది మంజీరతో గోదావరి అనుసంధానమవుతున్నది.
సిద్దిపేట, నిజామాబాద్ ప్రతినిధులు, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): కూడవెల్లి వాగు ద్వారా అప్పర్ మానేరును నింపుతున్న కాళేశ్వరం జలాలు.. తాజాగా హల్దీవాగు ద్వారా మంజీరాతో కలువనున్నాయి. అక్కడి నుంచి నిజాంసాగర్లోకి పరుగులు పెట్టనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో హల్దీవాగులోకి గోదావరి జలాల విడుదలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. త్వరలోనే కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవాగులోకి కాళేశ్వర గంగ అడుగిడనున్నది. హల్దీవాగు నుంచి సుమారు 96 కిలోమీటర్ల దూరంలోని నిజాంసాగర్కు నీటిని తరలించనున్నారు. దీంతో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. మేడిగడ్డ నుంచి రిజర్వాయర్లు, బరాజ్లను నింపుకుంటూ కాళేశ్వర జలాలు 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సిగలో చేరిన విషయం తెలిసిందే.
‘పసుపు’ పచ్చ వారధి
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తున్కిఖల్సా తపాస్ఖాన్ చెరువు వద్ద పుట్టింది హల్దీ వాగు. నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్దనుంచి మెదక్ జిల్లాలోకి ప్రవేశించి.. తూప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల మీదుగా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వద్ద మంజీరలో కలుస్తుంది. అక్కడి నుంచి నిజాంసాగర్లోకి వెళ్తుంది. హల్దీవాగు నుంచి నిజాంసాగర్ వరకు (ఉమ్మడి నిజామాబాద్ జిల్లా) సుమారు 96 కిలోమీటర్లు ఉంటుంది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి వెళ్లే సంగారెడ్డి కెనాల్పై 6.25 కిలోమీటర్ వద్ద నిర్మించిన ఓటీ ద్వారా బంధం చెరువు, పెద్దచెరువు, అంబర్పేటఖాన్ చెరువులకు నీటిని మళ్లిస్తారు. అక్కడి నుంచి 5.5 కిలోమీటర్ల మేర తవ్వుతున్న కాలువ ద్వారా హల్దీవాగులోకి జలాలు చేరుకుంటాయి.
ఇప్పటికే ప్యాకేజీ 18 కింద 5 కిలోమీటర్ల మేర కాలువల తవ్వకం పూర్తయింది. హల్దీవాగులోకి చేరిన జలాలు నాచగిరి, తూప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల మీదుగా 70 కిలోమీటర్లు ప్రవహించి ఏడుపాయల వద్ద మంజీరాలో కలుస్తాయి. అక్కడి నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పరుగులు పెడుతాయి. హల్దీవాగుపై మొత్తం 39 చెక్డ్యాంలు ఉన్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ చెక్డ్యాంల నీటి కెపాసిటీ 0.621 టీఎంసీలు. సవ్యదిశలో కందకుర్తి వద్ద మంజీరతో సంగమించే గోదావరి.. ఇప్పుడు వందల కిలోమీటర్లు తిరిగి పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత సాక్షిగా మంజీరలో కలువనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అతి త్వరలోనే ఈ అద్భుతఘట్టం సాక్షాత్కారం కానున్నది.
476 కోట్లతో నాగమడుగు
కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలోనే నిజాంసాగర్ భారీ నీటిపారుదల ప్రాజెక్టు ఉన్నది. ఈ ప్రాజెక్టుద్వారా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కానీ.. ప్రాజెక్టుకు సమీపంలోని జుక్కల్, బిచ్కుంద, పెద్దకొడప్గల్, పిట్లం మండలాలకు నీళ్లందడం లేదు. ఇందుకు పరిష్కారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంజీర నదిలో నాగమడుగు లిఫ్ట్ కమ్ బరాజ్ నిర్మాణానికి 2018లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.476.25 కోట్లతో నిర్మించే ఈ పథకం ద్వారా నాలుగు మండలాల్లో సుమారు 40 వేల ఎకరాలకు సాగునీటి గోస తీరనున్నది. కాళేశ్వరం జలాలతో నిజాంసాగర్ను నింపడం ద్వారా రెండున్నరలక్షల ఆయకట్టుకు ఢోకా లేకపోగా.. నాగమడుగు ద్వారా 40 వేల ఎకరాలు స్థిరీకరణకు నోచుకోనున్నది
జుక్కల్ వరప్రదాయిని నాగమడుగు
మహారాష్ట్ర -తెలంగాణ సరిహద్దులో ఉన్న జుక్కల్ నియోజకవర్గంలో నాగమడుగు లిఫ్ట్ కమ్ బరాజ్ నిర్మాణంతో 40 వేల ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం ఊపిరి పోయనున్నది. వానకాలంలో మొగులువైపు చూసే పరిస్థితులు పోయి సాగునీటికి చింతతీరనున్నది. సీఎం కేసీఆర్ దయతో నిజాంసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడం, దిగువన నాగమడుగు లిఫ్ట్ నిర్మాణం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం పూర్తయితే జుక్కల్ ప్రాంత రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ఏడాదంతా పని దొరుకుతుంది.
ఇవీ కూడా చదవండి…