హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు, రచయిత చంద్ర మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత మూడేండ్లుగా నరాలకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్న ఆయన ఇటీవలే కరోనా బారినపడ్డారు. దీంతో సికింద్రాబాద్లోని మదర్ థెరిసా రీహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని బంజారాహిల్స్ శ్రీనగర్లోని నివాసానికి తరలించారు.
వరంగల్కు చెందిన చంద్ర.. 1946, ఆగస్టు 28న జన్మించారు. కొన్ని వేల కొద్ది తెలుగు పుస్తకాల కవర్ పేజీలు ఆయన చేతిలో రూపుదిద్దుకున్నాయి. వివిధ పత్రికల్లో కథలకు బొమ్మలు గీశారు. కథలు కూడా రాసిన చంద్ర.. బీ.నరసింగరావు తీసిన సినిమాల్లో నటించారు.