హైదరాబాద్ : రాష్ట్రంలోని పోడు భూముల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హరితహారంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టిన సందర్భంగా పోడు భూముల సమస్యలపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు.
అత్యుత్సాహం ఉండే అధికారులు.. అడవి మీద ఆధారపడి బతికే గిరిజనులను డిస్టర్బ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఘర్షణలు కూడా జరిగాయి. పోడు భూముల సమస్యలపై గతంలో చర్చలు కూడా జరిగాయి. గతంలో యూపీఏ గవర్నమెంట్ ఒక చట్టం కూడా తెచ్చింది. పోడు భూములు దున్నుకునే వారికి రక్షణ కల్పిద్దామని ఆ చట్టంలో పొందుపరిచారు. ఎట్టి పరిస్థితుల్లో ఫారెస్ట్ కింద నోటిఫై అయిన ల్యాండ్ ఓనర్షిప్కు మారదు. అది సెంట్రల్ యాక్ట్. అది మన చేతుల్లో కూడా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల మేరకు రూపొందించిన యాక్ట్ అని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 96,676 మంది గిరిజనులకు 3.8 లక్షల ఎకరాలకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం జరిగింది. రైతుబంధు ప్రారంభించినప్పుడు వీరికి రైతు బంధు వచ్చేది కాదు. ఆ తర్వాత వారికి కూడా రైతుబంధు ఇస్తున్నాం. ఈ పోడు భూముల వ్యవహరాన్ని తేల్చుతామని ప్రజలకు హామీ ఇచ్చాం. తేల్చాల్సిన అవసరం ఉంది. అటవీ అధికారులు, గిరిజనుల మధ్య గొడవలు ఉండటం మంచిది కాదు. అది సమసిపోవాలి.
ఈ సమస్యపై మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ చేశాం. వారు పలు దఫాలుగా చర్చించారు. ఇప్పటికే పట్టాలిచ్చిన భూములు కాకుండా, ఎంత భూమి పోడు వ్యవసాయం చేస్తున్నారో తేల్చితే, వారికి కూడా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి, రైతుబంధు ఇస్తే ఆ సమస్య సమసిపోతోంది. ఘర్షణ కూడా తగ్గిపోతుంది. అది కావాలంటే ఆ యాక్ట్ తేదీని పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. సబ్ కమిటీ రిపోర్టు ఆధారంగా ఈ శాసనసభ సమావేశాల్లోనే ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దాం. ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఇచ్చినంత మాత్రం వారు ఓనర్లు కారు. జీవన భృతి కోసమే ఈ పట్టా ఉపయోగపడుతుంది. అవసరమైతే పోడు భూముల విషయంలో అఖిలపక్ష బృందాన్ని బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని సీఎం అన్నారు.