శ్రీరాంపూర్, మార్చి 13: సింగరేణి యాజమాన్యం 2018-19 సంవత్సరానికి గాను శనివారం రూ.111 కోట్ల పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ)ని చెల్లించింది. కోలిండియా ఏటా కార్మికులకు కంపెనీ పనితీరుకు అనుగుణంగా ఫెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీం (పీఎల్ఆర్ఎస్) దీపావళి బోనస్ పేరుమీద చెల్లిస్తుంది. 2007 నుంచి దీన్ని కోలిండియా అమలు చేస్తున్నా సింగరేణిలో తెలంగాణ ఏర్పడేంత వరకూ పీఆర్పీ చెల్లించనే లేదు. దీని వల్ల అధికారులు ఏటా నష్టపోతున్నారు. కానీ 2014-15లో సీఎండీ శ్రీధర్.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోగా సానుకూలంగా స్పందించి, అదే ఏడాది నుంచి పీఆర్పీ అమలుకు అంగీకరించారు. తాజాగా 2018-19 సంవత్సరానికి గాను పీఆర్పీ రూ.111 కోట్లు సింగరేణిలోని 2,500 మంది అధికారులకు చెల్లించారు. దీంతో సింగరేణి అధికారులు సుమారు రూ.60 వేల నుంచి రూ.5 లక్షల వరకు అందుకున్నారు. పీఆర్పీ చెల్లించడంతో సీఎం కేసీఆర్, సీఎండీ శ్రీధర్కు సింగరేణి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.