హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చేపట్టనున్న 2020-21 జన గణనలో కులాలవారీగా బీసీ జనాభా లెక్కలను కూడా సేకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం ప్రభుత్వం తరపున ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టారు. ‘సమాజంలోని పేదవర్గాల సముద్ధరణను దృష్టిలో ఉంచుకొని, నిరుపేదలకు లబ్ధి చేకూర్చడం కోసం, వివిధ సంక్షేమ చర్యలు చేపట్టడానికి కచ్చితమైన గణాంకాలు నిర్వహించాల్సి ఉన్నది. సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పౌరులకు సంబంధించి రాజ్యంగంలోని సెక్షన్ 15 రూల్ 4,5, సెక్షన్ 16 రూల్ 4, సెక్షన్ 243(టీ) రూల్ 6 నిబంధనల మేరకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ 2021 సాధారణ జనాభా లెక్కలను నిర్వహించేటప్పుడు కులాలవారీగా వెనుకబడిన తరగతుల జనాభా లెక్కలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది’ అనే తీర్మాన పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘2020-21 జనాభా లెక్కలను కేంద్రం చేపట్టబోతున్నది. బీసీ కులాల జనాభా లెక్కలు కూడా తీయాలని దేశవ్యాప్తంగా కోరుతున్నారు. ఈ మేరకు చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపిస్తున్నాయి. మన రాష్ట్రంలో బీసీలు 50 శాతం వరకు ఉన్నారు. కాబట్టి, వారికి కూడా అనేక రంగాల్లో న్యాయం జరగాల్సి ఉన్నది. జనాభా గణనలో భాగంగా బీసీల కుల గణన కూడా చేయాలని తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అనంతరం అసెంబ్లీ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.