పల్లెల్లో కుస్తీ పోటీలకు తగ్గని ఆదరణ
గాంధారి, మార్చి 30 :ప్రస్తుతం ఎన్నో ఆధునిక క్రీడలు పుట్టుకొచ్చినప్పటికీ పల్లెల్లో కుస్తీ పోటీలకు ఉన్న ఆదరణ మాత్రం తగ్గలేదు. తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబంగా నిలుస్తున్న కుస్తీ పోటీలంటే పల్లె ప్రజలకు ఎంతో ఇష్టం. ఉమ్మడి జిల్లాలో చాలా గ్రామాల్లో నేటికీ కుస్తీ పోటీలను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వేసవిలో నిర్వహించుకునే పండుగలను పురస్కరించుకొని పల్లెల్లో కుస్తీ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. వేసవి కాలం వచ్చిందటే చాలు ఉమ్మడి జిల్లాలోని చాలా గ్రామాల్లో ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట కుస్తీ పోటీలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం పల్లెల్లో కుస్తీ పోటీలను గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో కుస్తీ పోటీలు జరుగుతున్నాయంటే చాలు పండుగ వాతావరణం నెలకొంటుంది. పోటీలను చూడడానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి స్థానిక మల్లయోధులతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పహిల్వాన్లు వస్తారు. పల్లెల్లో నిర్వహించే కుస్తీ పోటీలు ఒకవైపు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుండగా, మరోవైపు కొందరికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో జరిగే కుస్తీ పోటీలపై నమస్తే తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం..
కుస్తీ పోటీలకు తగ్గని ఆదరణ..
ప్రస్తుతం రెజ్లింగ్గా చెప్పుకుంటున్న కుస్తీ పోటీలకు పల్లెల్లో విశేష ఆదరణ ఉంది. ప్రసుత్తం ఎన్ని కొత్తకొత్త ఆటలు పుట్టుకొచ్చినప్పటికీ పల్లె ప్రజలకు కుస్తీ పోటీలపై ఉన్న మక్కువ మాత్రం తగ్గలేదు. ప్రతి సంవత్సరం ఆయా గ్రామాల ఆచార సంప్రదాయాల ప్రకారం కుస్తీపోటీలను నిర్వహించాల్సిన రోజున తప్పకుండా నిర్వహిస్తుంటారు. మైదాన ప్రాంతంలో నిర్వహించే పోటీలను చూడడానికి ఆయా గ్రామాల ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
చివరి కుస్తీ విజేతలకు వెండి కడియాల బహూకరణ..
కుస్తీ పోటీల్లో ప్రత్యేకమైనది చివరి కుస్తీ. నిర్వాహకులు చివరి కుస్తీలో పోటీ పడి గెలిచిన వారికి కుంకుమ బొట్టును పెట్టి, వెండి కడియాలను బహూకరిస్తారు. దీంతో పాటు పోటీలు రసవత్తరంగా సాగితే కొన్ని సందర్భాల్లో ఓడిపోయిన మల్లయోధుడికి సైతం నిర్వాహకులు బహుతులను అందజేస్తారు. విజేతలకు రెండు తులాలు మొదలుకొని పది తులాల వెండి కడియం వరకు బహూకరిస్తారు.
ప్రారంభమైన కుస్తీ పోటీలు
ఉమ్మడి జిల్లాలో పల్లె ప్రజలు ఎంతో ఇష్టపడే కుస్తీ పోటీలు ప్రతి సంవత్సరం శివరాత్రి, రంగుల పండుగలతో ప్రాంభమవుతాయి. వేసవి కాలం ప్రారంభం కావడంతో పల్లెల్లోని ప్రజలకు వ్యవసాయ పనుల్లో తీరిక దొరుకుతుంది. తరతరాలుగా వస్తున్న తమ గ్రామ సంప్రదాయం, ఆనవాయితీ ప్రకారం, ఆయా గ్రామాల్లో జరుపుకొనే పండుగలతో పాటు, కుస్తీ పోటీలను నిర్వహిస్తుంటారు. వేసవిలో జరుపుకొనే పండుగలను పురస్కరించుకొని పల్లెల్లో కుస్తీ పోటీలను నిర్వహిచడం ఆనవాయితీగా మారింది. శివరాత్రి, హోలీ నుంచి ప్రారంభమయ్యే కుస్తీ పోటీలు ఉమ్మడి జిల్లాలో ప్రతి రోజూ ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి.
గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో..
తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను నిర్వహిస్తుంటారు. ఇందుకోసం గ్రామాల్లో నిర్వాహకులు ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. పోటీల నిర్వహణకు అన్ని వర్గాల వారు ఆర్థిక సహాయం చేస్తారు. కుస్తీ పోటీల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలను తీసుకుంటారు. కుస్తీ పోటీలు జరిగే మైదానంలోకి ప్రజలు రాకుండా చుట్టూ తాళ్లతో కంచెలను ఏర్పాటు చేస్తారు. కుస్తీ పోటీలకు గ్రామ రెవెన్యూ అధికారులతో పాటు, పోలీసుల సహకారాన్ని తీసుకుంటారు.
పల్లెల్లో జాతర వాతావరణం…
పల్లె ప్రజలు తమ గ్రామాల్లో కుస్తీ పోటీలు జరుగుతున్నాయంటే తమ బంధువులతో పాటు, స్నేహితులను ఇండ్లకు ఆహ్వానిస్తుంటారు. పోటీలను తిలకించడానికి జనం పెద్ద సంఖ్యలో రావడంతో, కుస్తీ పోటీలు జరిగే ప్రాంతమంతా దుకాణ సముదాయాలతో నిండిపోతాయి, దీంతో జాతర వాతావరణం నెలకుంటుంది. కుస్తీ పోటీలను ప్రధానంగా బాన్సువాడ, గాంధారి, పిట్లం, తాడ్వాయి,లింగంపేట్ , నిజాంసాగర్, జుక్కల్, మద్నూర్, పెద్దకొడప్గల్, బీర్కూర్, కోటగిరి, బిచ్కుంద, బోధన్, వర్ని, నస్రుల్లాబాద్ తదితర మండలాల్లో ఘనంగా నిర్వహిస్తారు.
కొబ్బరికాయ కుస్తీతో మొదలు…
కుస్తీ పోటీలను బాజాభజంత్రీల నడుమ ఘనం గా ప్రారంభిస్తారు. మొదట చిన్న పిల్లలతో కొబ్బరికాయ కుస్తీని నిర్వహిస్తారు. మొదటి కుస్తీలో గెలిచిన విజేతకు నిర్వాహకులు కుంకుమ తిలకం పెట్టి, కొబ్బరికాయను బహుమతిగాఅందజేస్తారు. అనంతరం రూ.10, రూ. 20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 నుంచి వెండి కండియం వరకు పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీలను వివిధ దశల్లో నిర్వహిస్తా రు. మల్లయోధులు తమ సమఉజ్జీలతో ఆయా విభాగాల్లో పోటీపడుతారు.
కుస్తీ పోటీలపై కరోనా ప్రభావం..
పల్లెవాసులను ఎంతగానో అలరించే కుస్తీ పోటీలపై కరోనా ప్రభావం పడింది. గత సంవత్సరం కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో, ఆయా గ్రామాల్లో వేసవిలో నిర్వహించాల్సిన కుస్తీ పోటీలు నిర్వహించలేదు. దీంతో మల్లయోధులు ఉపాధిని కోల్పోయారు. కుస్తీ పోటీలతో పాటు, జాతరలు సైతం రద్దు కావడంతో చిరు వ్యాపారులు సైతం తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, కొవిడ్-19 వ్యాక్సిన్ రావడంతో ఈ సంవత్సరం కుస్తీ పోటీలు తిరిగి నిర్వహిస్తున్నారు
మల్ల యోధులకు ఉపాధి
కుస్తీ పోటీలను తిలకించేందుకు ఒకవైపు ప్రజలు ఆసక్తి చూపుతుండగా మరోవైపు మల్లయోధులకు ఉపాధి కల్పిస్తున్నాయి. చాలా మంది పహిల్వాన్లు కనీసం ఐదు, ఆరు పోటీల్లో గెలుపొందుతారు. ఒకే రోజు వేల రూపాయల నగదుతో పాటు, వెండి కడియాలను సంపాదిస్తారు. మల్లయోధులు చాలామంది తమ గ్రామాల నుంచి ఆటోలు, జీపులు తీసుకొని మరీ పోటీలకు హాజరవుతారు. ఎక్కడ కుస్తీ పోటీలు జరిగినా మల్లయోధులు రోజుల తరబడి కుస్తీ పోటీల్లో పాల్గొంటారు.
ఇవీ కూడా చదవండి..
లాటరీ మెసేజ్ వచ్చిందా? అయితే.. ఒక్క నిమిషం ఆగండి