సంసార విషవృక్షస్య ద్వేఫలే అమృతోపమే కావ్యామృత రసాస్వాదః సల్లాపస్సజ్జనై స్సహ.
‘సంసారమనేది ఒక విషవృక్షమైతే, దాని రెండు ఫలాలు మాత్రం అమృతమంత మధురంగా ఉంటాయి. అవి: కావ్యామృతాన్ని ఆస్వాదించడం, సజ్జనులతో సద్గోష్ఠి జరపడం’. నిజమే. మన ఈ జన్మకు కారణం మనం కాదు. ఎందుకీ మానవజన్మ లభించిందో ఎవరికీ తెలియదు. ఈ ఆట ఎప్పుడెలా ముగుస్తుందో కూడా అంతుపట్టదు. ‘దుర్లభమైన ఈ మానవజన్మనూ, అందునా శ్రేష్ఠతమమైన స్థితిని పొంది కూడా సార సంసారాన్ని నిస్సారం చేసుకోవడమెందుకు?’ అని ఒక్క క్షణం ఆలోచిస్తే కర్తవ్యం బోధపడుతుంది. లోకంలోని ఇతర అన్ని జంతువుల్లాగే మనముందామా? ఆహారం, నిద్ర, భయం, సంసార సుఖాలు వంటివి పొందడం.. ఇంతేనా జీవితమంటే?- అని ఆలోచించారు మన పూర్వీకులు. ఏ జీవికీ లేని మేధాశక్తిని, అసామాన్య వివేచనను, సమస్త అనుభూతులను వ్యక్తీకరించగల అపార వాఙ్మయ సంపద వంటివి కలిగి ఉన్నందువల్లే మానవుడు మహోన్నతుడు అవుతున్నాడు. ఇవేవీ లేకపోతే మనిషికి, మామూలు జంతువులకు తేడాయే ఉండదు.
మనకన్నా ఎన్నెన్నో తరాల ముందే వేదర్షులు, తాత్త్వికులు, శాస్త్రవేత్తలు చేసిన అనేక ఆలోచనలు, పరిశోధనల ఫలితాలనే మనమిప్పుడు అనుభవిస్తున్నాం. వారి ప్రజ్ఞాసారమే మన జీవితాలకు రక్షగా నిలుస్తున్నది. మనిషిగా జన్మించినందుకు ధర్మాచరణ మార్గంలో నడుస్తూ చతుర్విధ పురుషార్థాలను (ధర్మార్థ కామమోక్షాలు) క్రమంగా సాధించాలంటున్నది భారతీయ సనాతన ధర్మం. ఈ క్రమంలో మనిషి జయించవలసింది మనస్సును! దీని కోసం ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. అంటే, అనవసర కోరికలను తగ్గించుకోవాలి.
ఆత్మానం రథినంవిద్ధి శరీరం రథమేవ తు
బుద్ధింతు సారథింవిద్ధి మనః ప్రగ్రహమేవచ॥
ఇంద్రియాణి హయానాహుర్విషయాం స్తేస్తు గోచరాన్
ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్తనీపిణః॥