పట్టభద్రుల ఎన్నికల్లోనూ కొనసాగిన జైత్రయాత్ర
మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్వంలో సీఎం కేసీఆర్ను కలిసిన నేతలు
ఇదే ఊపును సాగర్లోనూ కొనసాగించాలని సూచన
రేపే సాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్
నల్లగొండ ప్రతినిధి, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : సెప్టెంబర్ చివరలో పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు కార్యక్రమ షెడ్యూల్ వెలువడిన నాటినుంచి శనివారం తుది ఫలితం వచ్చే వరకు టీఆర్ఎస్ శ్రేణులు సాగించిన అవిశ్రాంత కృషికి భారీ విజయమే లభించిందని చెప్పవచ్చు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకత్వంలో ఎప్పటికప్పుడు అన్నిస్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, నేతలూ, కార్యకర్తల వరకు పట్టుదలతో ముందుకు సాగారు. దాదాపు ఐదున్నరనెలల పాటు చిత్తశుద్ధితో, పట్టుదలతో పనిలో నిమగ్నమై పార్టీ అభ్యర్థి విజయతీరం చేరడంలో తమవంతు పాత్ర పోషించారు. వరంగల్, ఖమ్మం జిల్లాలతో నియోజకవర్గం కూడి ఉన్నా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఎంపీ బడుగులతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులంతా సమరోత్సాహంతో కదిలి పనిచేశారు. ఎక్కడికక్కడే సమష్టితత్వం ప్రదర్శిస్తూ.. పట్టభద్రుల ఓట్లను చేర్పించడం మొదలు.. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వారిని తమవైపు ఆకర్షించడం.. ఓటు వేసేందుకు ఒప్పించడం.. చివరకు పోలింగ్ కేంద్రం వరకు తీసుకురావడం ఇలా ప్రతి దశలోనూ విరామం ఎరుగకుండా పనిచేశారు. ప్రతిపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్నవారు ప్రభుత్వంపై, పార్టీ నేతలపై చేస్తున్న అసత్యారోపణలు, అభూత కల్పనలను అన్ని వేదికలపై తిప్పికొడుతూ ధీటైన కౌంటర్లు ఇచ్చారు. నేతలు, శ్రేణుల విరామమెరగని సమష్టి కృషికి అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అవిశ్రాంత పర్యటనలు, ప్రచారాలు, సమావేశాలు తోడయ్యాయి. రాజేశ్వర్రెడ్డి కూడా ఉమ్మడి జిల్లా పరిధిలో విస్త్రతంగా పర్యటిస్తూ తన వాణిని బలంగా వినిపించారు. ఏ అంశాలను ఆధారంగా చేసుకుని ఇతర అభ్యర్థులంతా దుష్ప్రచారం చేస్తున్నారో వాటిపైనే మరింత స్పష్టతనిస్తూ దీటైన సమాధానాలు ఇచ్చారు. పోలింగ్లోనూ చివరకు నాలుగురోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపులోనూ పార్టీ శ్రేణులు పాత్ర ఎంతో విలువైంది. పల్లా ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే 1,10,840 ఓట్లు సాధించి 27550 స్పష్టమైన మెజార్టీ చేజిక్కించుకున్నారు. ఇక ఎలిమినేషన్ రౌండ్స్లో ద్వితీయ, ఆ తదుపరి ప్రాధాన్యత ఓట్లల్లోనూ భారీగానే 87527 ఓట్లను సాధించారు. మొత్తంగా చూస్తే చెల్లిన ఓట్లలో 54.14 శాతం షేరింగ్తో 1,98,367 ఓట్లను పొందారు. గెలుపు కోటాను దాటి ముందుకు దూసుకుపోయారు. బరిలో ఉన్న మిగతా 71మంది అభ్యర్థులంతా పార్టీ అభ్యర్థిగా తనను మాత్రమే ప్రత్యర్థిగా చూశారని, వారందరికీ ధీటైన సమాధానాలు ఇవ్వడంతోపాటు పార్టీ, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రి జగదీశ్రెడ్డి నుంచి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి నేతల సమష్టికృషి, పట్టుదల ఎంతో ఉందని తన విజయానంతరం పల్లా రాజేశ్వర్రెడ్డి వెల్లడించారు. తన విజయం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేసిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం మార్గదర్శనం చేస్తూ ఎన్నికల్లో తనతోపాటు యావత్తు పార్టీని ముందుకు నడిపించిన అధినేత కేసీఆర్కే తన విజయాన్ని అంకితం చేస్తున్నట్లు పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలోనూ మంత్రి జగదీశ్రెడ్డితో పాటు ముఖ్యనేతలంతా తరలివచ్చి మరింత ఉత్సాహాన్ని నింపారు. ఇదే ఉత్సాహంతో సాగర్ ఉప ఎన్నికల్లోనూ పనిచేద్దామని మంత్రి ఈ సందర్భంగా పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. విద్యాధికులైన పట్టభద్రులు కూడా ప్రభుత్వానికి, పార్టీగా అండగా నిలిచారని, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల పప్పులు ఉడకవని, తిరుగులేని నాయకత్వం కేసీఆర్తోనే సాధ్యమని మరోసారి ఈ విజయం స్పష్టం చేసిందని మంత్రి వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక అభినందన..
పట్టభద్రుల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రగతి భవన్లో ఆదివారం మధ్యాహ్నం పార్టీ అధినేత కేసీఆర్ను కలిసారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో పల్లాతోపాటు జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ముఖ్యనేతలంతా ప్రగతిభవన్కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా శాలువా కప్పి సత్కరించారు. పల్లాకు ఘన విజయాన్ని కట్టబెట్టిన అన్నివర్గాల పట్టభద్రులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. పల్లా విజయంలో భాగస్వాములై ముందుకు నడిచిన పార్టీ నేతలను, శ్రేణులను కేసీఆర్ అభినందించారు. ఇదే ఉత్సాహాన్ని సాగర్ ఉప ఎన్నికలోనూ కొనసాగించాలని సూచించారు. సాగర్లోనూ పార్టీ, ప్రభుత్వ విధానాలకు మంచి సానుకూలత ఉందని, దాని ఆధారంగా విస్త్రతంగా ప్రజల్లోకి వెళ్లి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో సీఎంను కలిసిన వారిలో పల్లా రాజేశ్వర్రెడ్డితోపాటు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునితా, జడ్పీ చైర్మన్లు బండా నరేందర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ రాంచందర్నాయక్, పార్టీ రాష్ట్ర నేతలు సోమ భరత్కుమార్, వేమిరెడ్డి నర్సింహారెడ్డి, చకిలం అనిల్కుమార్, నంద్యాల దయాకర్రెడ్డి, జిల్లా శంకర్ తదితరులు ఉన్నారు.
రేపే ఉప ఎన్నిక నోటిఫికేషన్..
నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు మంగళవారం నోటిఫికేషన్ వెలుడనుంది. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం 11గంటలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్సింగ్ నోటిఫికేషన్ను జారీ చేయనున్నారు. ప్రతిరోజూ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం మూడుగంటల వరకు నిడమనూరు తాసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నారు. అందుకోసం తాసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించారు. 31న నామినేషన్ల పరిశీలన అనంతరం వచ్చే నెల 3వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అదేరోజు అభ్యర్థుల తుది జాబితాను వెల్లడించి వచ్చేనెల 17న పోలింగ్ నిర్వహిస్తారు.
మే 2న దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్తోపాటు ఇక్కడ చేపడతారు. వాస్తవంగా ఏప్రిల్ ఆరో తేదీనే పోలింగ్ ఉండొచ్చని అంచనాలో ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పటికే సాగర్ సమరంలో బిజీబిజీ అయ్యాయి. చాపకింద నీరులా ఓటర్లను కలిసే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత కుందూరు జానారెడ్డిని ఇప్పటికే అధికారికంగా ఆ పార్టీ ప్రకటించింది. ఇక టీఆర్ఎస్ అభ్యర్థిపై కూడా నేడో రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బిజేపీ, ఇతర విపక్షాలు తమ అభ్యర్థులపై ఇంకా కసరత్తు చేస్తూనే ఉన్నాయి. నామినేషన్ల కార్యక్రమం మొదలైతే పూర్తిస్థాయి ఎన్నికల సందడి షురూ అయినట్లే. నాగార్జునసాగర్లో ఇప్పటివరకు 2,16,983మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. తుదిజాబితా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.