హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బీఏ ఆనర్స్ పేరుతో కొత్తగా రెండు స్పెషలైజేషన్ కోర్సులను తీసుకొచ్చారు. పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా కోఠి మహిళా కాలేజీ, నిజాం కాలేజీ, సిటీ కాలేజీ, బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలల్లో బీఏ ఆనర్స్ – పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ కోర్సులను ప్రవేశపెట్టారు. మంగళవారం వీటిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కోఠి ఉమెన్స్ కాలేజీలో ప్రారంభించారు. ఈ కోర్సుల్లో (60 సీట్లు) చేరేందుకు వీలుగా డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) రిజిస్ట్రేషన్ల గడువును ఈ నెల 23 వరకు పొడిగించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ రెండు కోర్సుల బోధన భిన్నంగా ఉండనున్నది. పొలికల్ సైన్స్ విద్యార్థులకు పాఠ్యాంశాలను ఎంపీలు, మాజీ ఎంపీలు, పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ చైర్మన్లుగా పనిచేసినవారితో బోధిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాఠ్యాంశాన్ని ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు, స్థానిక సంస్థల పాఠ్యాంశాన్ని జెడ్పీ చైర్మన్లు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులతో చెప్పిస్తారు. ఎకనామిక్స్ విద్యార్థులకు రిజర్వ్బ్యాంక్ గవర్నర్లు, ఆర్థికమంత్రులుగా పనిచేసిన వారు.. స్టాండింగ్ కమిటీ చైర్మన్లు, సభ్యులుగా సేవలందించిన వారు బ్యాంకింగ్ రంగ నిపుణుల చేత బోధిస్తారు. ఇందుకు ఆయా నిపుణుల షెడ్యూల్ మేరకు ప్రత్యేకంగా అకడమిక్ క్యాలెండర్ను రూపొందించి పకడ్బందీగా అమలుచేస్తారు.