హైదరాబాద్ : డిగ్రీ కాలేజీలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేయతలపెట్టిన క్లస్టర్ విధానంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో క్లస్టర్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ఏడాది డిగ్రీ సెకండియర్ విద్యార్థులకు మాత్రమే క్లస్టర్ విధానంలో చదువుకునే అవకాశం కల్పించనున్నారు. డిగ్రీ కాలేజీలను భాగస్వామ్యం చేస్తూ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యామండలి గతంలోనే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
తెలంగాణ వ్యాప్తంగా 50కి పైగా క్లస్టర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్న అధికారులు తొలుత హైదరాబాద్లో పైలెట్ ప్రాజెక్ట్గా ప్రారంభించి దశల వారీగా రాష్ట్రమంతటా క్లస్టర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇదే అంశంపై శుక్రవారం ఉన్నత విద్యామండలి అధికారులు కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, ప్రొఫెసర్ డీ. రవీందర్, సహా 9 కాలేజీల ప్రిన్సిపాళ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.