మూడు ఆప్షన్లు ఎంచుకునే అవకాశం
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది జేఎన్టీయూ బీటెక్, బీఫార్మసీ చివరి సెమిస్టర్ పరీక్షా కేంద్రాలను క్లస్టర్లవారీగా నిర్వహించనున్నారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా క్లస్టర్లను ఏర్పాటుచేస్తున్నారు. విద్యార్థులు ఈ నెల 12లోగా క్లస్టర్లను ఎంపికచేసుకోవాలని జేఎన్టీయూ అధికారులు సూచించారు. ఆయా ప్రాంతాల్లోని కొన్ని కాలేజీలను గ్రూపుగా చేసి, క్లస్టర్లను ఏర్పాటుచేస్తారు. విద్యార్థి గరిష్ఠంగా మూడు ఆప్షన్లను ఎంచుకొంటే, అందుకు అనుగుణంగా పరీక్షా కేంద్రాలు కేటాయిస్తారు. గతేడాది విద్యార్థి కోరుకున్న కాలేజీల్లోనే పరీక్షా కేంద్రాలను కేటాయించడంతో మాస్ కాపీయింగ్ జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. దీంతో ఈ ఏడాది క్లస్టర్ విధానం ప్రవేశపెడుతున్నారు. జేఎన్టీయూ బీటెక్, బీ ఫార్మసీ చివరి సెమిస్టర్ (4వ సంవత్సరం రెండో సెమిస్టర్) పరీక్షలను జూలై 1 -7 వరకు నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ మంజూరుహుస్సేన్ తెలిపారు.
క్లస్టర్ల ఎంపిక ఇలా..
విద్యార్థి తాను చదువుతున్న కాలేజీ ఉన్న క్లస్టర్లో పరీక్షలు రాయాలనుకొంటే ఆప్షన్లు ఎంచుకోవాల్సిన అవసరంలేదు.
తమ కాలేజీ ఉన్న క్లస్టర్లో కాకుండా, తమ ఇంటికి సమీపంలోని కాలేజీల్లో పరీక్షలు రాయాలనుకునేవారు ఆప్షన్లు ఎంచుకోవాలి.
క్లస్టర్లను ఎంపిక చేసుకొనేటప్పుడు ఉదాహరణకు మొదటి ప్రాధాన్యంగా క్లస్టర్ నంబర్ 10, రెండో ప్రాధాన్యంగా క్లస్టర్ నం.2, మూడో ప్రాధాన్యంగా క్లస్టర్ నం.17 ఇలా తమకు సమీపంలోని క్లస్టర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఆప్షన్లు ఎంచుకోని పక్షంలో విద్యార్థి చదువుతున్న కాలేజీ ఉన్న క్లస్టర్లోనే కేంద్రాన్ని కేటాయిస్తారు.
పరీక్షా కేంద్రాన్ని కేటాయించిన తర్వాత ఎలాంటి మార్పులు చేయరు.
క్లస్టర్ పరిధిలో సీటింగ్ సామర్థ్యం మించితే విద్యార్థులు చదువుతున్న కాలేజీలోనే కేటాయిస్తారు.