హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): దేశంలోని వివిధ క్వాసీ జ్యుడిషియల్ సంస్థల్లో అనేక పోస్టులను ఖాళీగా ఉంచినందుకు కేంద్రంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. దీర్ఘకాలంగా ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం అత్యంత విచారకరమని వ్యాఖ్యానించింది. ఖాళీలను భర్తీ చేయకుండా కీలక ట్రిబ్యునళ్లను మూసేయాలని అనుకుంటున్నారా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్తో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని సూటిగా నిలదీసింది. ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం వెనుక కొన్ని లాబీల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపింది.
జాతీయ, ప్రాంతీయ ట్రిబ్యునళ్ల ఏర్పాటు కోరుతూ న్యాయవాది అమిత్సాహ్ని దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ కొనసాగింది. రుణ రికవరీ ట్రిబ్యునల్, డీఆర్ఏటీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్, ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఆదాయం పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ లాంటి క్వాసీ జ్యుడిషియల్ సంస్థల్లో 200కు పైగా కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయని చీఫ్ జస్టిస్ రమణ కోర్టులో చదివి వినిపించారు.
15 ట్రిబ్యునళ్లలో ప్రిసైడింగ్ అధికారులు కూడా లేరని వెల్లడించారు. ఖాళీల భర్తీకి సుప్రీంకోర్టు నేతృత్వంలోని సెలక్షన్ కమిటీలు పలువురి పేర్లను సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. దీన్ని ఇలాగే కొనసాగనివ్వబోమని తేల్చిచెప్పారు. అసలు బ్యూరోక్రసీకి ట్రిబ్యునళ్లు అక్కర్లేదని అనుకుంటున్నారా? లేదంటే ఖాళీలను భర్తీ చేయకుండా ట్రిబ్యునళ్లను మూసేయాలని భావిస్తున్నారా? అని కేంద్ర ప్రభుత్వ సాలిసిటర్ జనరల్ తుషార్మెహతాను ప్రశ్నించారు. మూసేయడమే కేంద్రం ఉద్దేశమైతే ట్రిబ్యునళ్ల అధికారాలను కోర్టులకు ఇవ్వాలని, అంతేకానీ న్యాయాన్ని పొందే ప్రజల హక్కును హరించలేరని స్పష్టం చేశారు. ఈ అంశంపై త్వరగా స్పష్టతనివ్వాలని చీఫ్ జస్టిస్ ఆదేశించగా.. విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తానని సాలిసిటర్ జనరల్ కోర్టుకు విన్నవించారు. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నామని, ప్రభుత్వ నిర్ణయాన్ని త్వరగా తెలియజేయకుంటే అత్యున్నత అధికారులను సైతం కోర్టుకు రప్పిస్తామని సీజేఐ హెచ్చరించారు. విచారణను 16వ తేదీకి వాయిదా వేశారు.