హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రెండింటికి రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఘోర పరాజయం చెందడంతో కారణాలను విశ్లేషించుకొనే పనిలో బీజేపీ తలమునకలైనట్టు తెలుస్తున్నది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం ఒకెత్తయితే, ఐదు, ఆరుస్థానాల్లో పార్టీ అభ్యర్థి నిలవడం పట్ల డీలా పడింది. అయితే దీనికి పార్టీ తప్పిదాలే కారణమని కమలం నాయకులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ పరాభవానికి ఒక నేత ఓవర్ యాక్షనే కారణమని పార్టీలో సీనియర్ నాయకులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తున్నది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, ఎవరిని లెక్క చేయకపోవటం, నోటికి వచ్చినట్టు మాట్లాడటాన్ని మొదటి నుంచి విభేదిస్తున్న పార్టీ పాత నాయకులు.. ఇప్పుడు పార్టీ పరువును బజారులో పడేశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నట్లు సమాచారం. రెండు స్థానాల అభ్యర్థుల ప్రకటన దగ్గరి నుంచి మొదలుపెడితే ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయడం వరకు అదే పంథాను కొనసాగించినట్టు విమర్శలు ఉన్నాయి. దీనికితోడు పార్టీలో కీలకంగా ఉన్నానని చెప్పుకొనే మరో నేత సొంత పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలుపకుండా, మరొక అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. పార్టీ సీనియర్లు, జూనియర్లకు మధ్య సమన్వయాన్ని సృష్టించాల్సింది పోయి, సమరానికి ఆజ్యం పోశారని ఆ ఇద్దరి నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చిరాగానే గ్రూపులు కట్టి, తన వర్గాన్నే ప్రోత్సహిస్తూ మిగిలిన వారిని అణిచివేస్తున్నారని మండిపడుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొందరు సీనియర్ నాయకులు సమావేశమై ఆ ఇద్దరు నేతలపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే ఎవరి దారి వారు చూసుకొనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.
మండలిలో కమలం కనుమరుగు
హైదరాబాద్, నల్లగొండ పట్టభద్రుల స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపుతో శాసన మండలిలో బీజేపీకి ప్రాతినిధ్యం లేకుండాపోయింది. 2015లో బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్ రాంచందర్రావు గెలుపుతో మండలిలో అడుగుపెట్టిన బీజేపీ తాజాగా ఆయన ఓటమితో ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. హైదరాబాద్ గెలుపుతో టీఆర్ఎస్ పార్టీకి మండలిలో అదనంగా మరో స్థానం పెరిగింది. మండలిలో ఎంఐఎంకు ఇద్దరు, కాంగ్రెస్కు ఒక్క సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.