చేర్యాల, జూన్ 24 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో శాతవాహనుల కాలం నాటి మట్టిముద్రలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ.. ఆకునూరులో కొత్తగా రెండు టెర్రకోట ముద్రలతోపాటు మట్టిచిత్తుడు బిళ్ల, నడుము పైభాగం విరిగిన టెర్రకోట బొమ్మ, పగిలిన మట్టిపూస, మట్టిబిరడా, తునికరాయి, రాతిసుత్తె, ఇనుము, చిట్టం దొరికినట్టు చెప్పారు. ఇవి పిడికిట్లో పట్టుకుని ముద్రవేయడానికి అనువుగా ఉన్నాయన్నారు. టెర్రకోట ముద్రకు అడుగున రెండు వరుసల గుండ్రని గీతల నడుమ చుక్కలు కనిపిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.