ఆదిలాబాద్ : వివిధ రకాల కాలుష్యం వల్ల నాశనం అవుతున్న ప్రకృతిని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మట్టి విగ్రహాలను పూజించడం ఎంతో శ్రేష్టం అని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో వినాయకచవితి సందర్భంగా కుమ్మరి కులస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల ప్రదర్శనను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అంతకుముందు కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా కాళోజీ చిత్రపటానికి ఎమ్మెల్యేలతో పాటు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మట్టి వినాయక విగ్రహాలను పలువురికి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక చేతి వృత్తి కులాలకు పూర్వ వైభవం తీసుకొచ్చిందన్నారు.
అంతకు ముందు సైతం చేతి వృత్తి కులాలు ఉన్నప్పటికీ అవి పూర్తిగా నిర్జీవం అయ్యాయని, తాను బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుల వృత్తులకు మళ్లీ పూర్వ వైభవం తీసుకు రావడం కోసం కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇందులో భాగంగానే కుమ్మరులను గుజరాత్ కు తీసుకెళ్లి మట్టితో తయారు చేసే పలు రకాల వస్తువులపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. రకరకాల రంగులు, కెమికల్స్ తో తయారు చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో నీరు, వాతావరణం కాలుష్యం అవుతోందని తెలిపారు. భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను ప్రతిష్టించి, పూజించాలని కోరారు.
కార్యక్రమంలో కుమ్మరి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కన్నబి మోహన్, కౌన్సిలర్ భరత్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, సునీత, సామాజిక కార్యకర్త బండారి దేవన్న పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పరువు నష్టం కేసులో నటి కంగనాకు చుక్కెదురు
Nizamabad : పైకి తేలిన అంతరాష్ట్ర రహదారి
నేషనల్ హైవేపై దిగిన సుఖోయ్, జాగ్వార్ యుద్ధ విమానాలు.. వీడియో