హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): క్లాసులో ఒక్కోసారి టీచర్లు చెప్పే పాఠాలు వినాలనిపించదు. ఈ పాఠమేదో తర్వాత చెప్తే బాగుండు అనుకొంటాం. కానీ, సిలబస్ను క్రమం తప్పకుండా పూర్తిచేయాలి కాబట్టి టీచర్లు చెప్పి తీరుతారు. మనం విని తీరాలి. ఆన్లైన్ క్లాసుల పుణ్యమాని ఇప్పుడా అయిష్టానికి కాస్త బ్రేక్ పడుతున్నది. ఎప్పుడు కావాలంటే అప్పుడే పాఠం వినే వెసులుబాటు కలుగుతున్నది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన టీశాట్.. అలాంటి సౌలభ్యాన్నే కలిగిస్తున్నది. టీశాట్ ద్వారా ఎప్పుడంటే అప్పుడు, ఏ పాఠం కావాలంటే ఆ పాఠం వినే అవకాశం కలుగుతున్నది. టీశాట్ యాప్లో 8,121 వీడియోలను అప్లోడ్ చేశారు. మూడ్ ఉన్నపుడే పాఠం వినొచ్చు. ఈ యాప్ను ఇప్పటివరకు 12 లక్షల మంది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకొన్నారు. కరోనా ప్రభావం ఉన్నా, విద్యాసంవత్సరాన్ని పకడ్బందీగా నడపాలన్న సదుద్దేశంతో విద్యాశాఖ అధికారులు టీశాట్ యాప్ను అస్త్రంగా వినియోగిస్తున్నారు.
టీశాట్ వినియోగం తీరు (జూన్ 5నాటి వివరాలు)
రిజిస్టర్ చేసుకొన్నవారు 4,41,514
ఆండ్రాయిడ్ డౌన్లోడ్స్ 12 లక్షలు
అమెజాన్ ఫైర్స్టిక్ డౌన్లోడ్స్ 412
ఐవోఎస్ డౌన్లోడ్స్ 10,400
అప్లోడ్ చేసిన వీడియోలు 8,121
వీడియోల వ్యవధి 5, 470.46 గంటలు
మొత్తం వ్యూస్ 5,63,20,829
వీక్షించిన మొత్తం నిమిషాలు 2,13,97,434
టీవీలున్న ప్రతి ఇంట్లో టీశాట్ వీక్షకులు
రాష్ట్రంలోని విద్యార్థుల సౌకర్యార్థం టీశాట్ యాప్ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆన్లైన్ పాఠాల ప్రసారానికి మేం సిద్ధం. విద్యాశాఖ అధికారుల నుంచి ఆదేశాలు రాగానే ప్రసారాలను ప్రారంభిస్తాం. – శైలేశ్రెడ్డి, టీశాట్ సీఈవో