కరీంనగర్ కార్పొరేషన్, మే 20: తామంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటామని, పార్టీ నిర్ణయం మేరకు పనిచేస్తామని హుజూరాబాద్ మున్సిపాల్ టీఆర్ఎస్ కౌన్సిలర్లు స్పష్టంచేశారు. ఈటల రాజేందర్ బర్తరఫ్తో తమకు, పాలకవర్గానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని, ఇకపై అభివృద్ధి పనులను వేగంగా సాగిస్తామని పేర్కొన్నారు. గురువారం హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్తోపాటు టీఆర్ఎస్కు చెందిన 21 మంది కౌన్సిలర్లు కరీంనగర్ మేయర్, హుజూరాబాద్ మున్సిపల్ టీఆర్ఎస్ ఇంచార్జి వై సునీల్రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ.. ఇప్పటివరకు రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో అనేక ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ప్రతి పథకంలోనూ ప్రజల కష్టాలు తీరాలన్న సీఎం కేసీఆర్ తపన దాగి ఉన్నదని చెప్పారు. తామంతా సీఎం కేసీఆర్తోనే ఉంటామని, మున్సిపాలిటీని అభివృద్ధ్ది చేసుకుంటామని చెప్పారు. మేయర్ను కలిసినవారిలో మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ నిర్మల, 21 మంది కౌన్సిలర్లు ఉన్నారు.