నల్లగొండ : కాంగ్రెస్ నాయకులు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరును నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత అన్నేపర్తి శేఖర్ రాజీనామా చేశారు. గంటకో మాట.. గడియకో పార్టీ పేరుతో.. కార్యకర్తలను మోసం చేస్తున్న రాజగోపాల్ రెడ్డి వైఖరి నచ్చక కాంగ్రెస్ సీనియర్ నేత, చండూర్ మున్సిపల్ కౌన్సిలర్ అన్నేపర్తి శేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డివి అన్ని ఆర్భాటాపు ప్రకటనలేనన్నారు. చెప్పిన వాటిలో ఏ ఒక్కటి కూడా చేసింది లేదని ఆరోపించారు. తన రాజకీయ పబ్బం కోసం కార్యకర్తలను నమ్మిస్తూ భ్రమింప చేయడంలో దిట్ట అని, ఆయన నైజాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారని చెప్పారు.
ఏన్నికల ముందు ప్రభుత్వ నిధులే కాదు, వందల కోట్లు తన సొంత డబ్బులతో అనేక చెరువులు, పరిశ్రమలు, దవాఖానాలు, అంబులెన్ల్సులు, యువతకు ఉపాధి, పేదలకు ఇండ్లు కట్టిస్తానని హామీల వరదలను పారించాడని విమర్శించారు. ఇలాంటి మాయ మాటలతో ప్రజలను, మాలాంటి మండల స్థాయి ప్రజాప్రతినిధులను నమ్మించి గెలిచాడని చెప్పారు.
ముఖ్యమంత్రిని నేనే, పీసీసీ నేనే, బీజేపీ అధ్యక్షున్ని నేనే, జై షర్మిల, జై తీన్మార్ మల్లన్న, ఈటెలను గెలిపించాలని.. ఇలా ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెల్వదన్నారు. పట్నంల జై బీజేపీ, జై ఈటల అంటూ పల్లెలకొస్తే జై కాంగ్రెస్ అనడం ఆయనకే చెల్లిందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇలాంటి మతిలేని నాయకున్ని నమ్ముకుంటే అభాసుపాలై, జైలు పాలు కాక తప్పదని హితువు పలికారు.