ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్
త్వరితగతిన మందులు అందించడమే లక్ష్యం
అనంతగిరిలోని 200 పడకల దవాఖానలో కొవిడ్ చికిత్సకు నిర్ణయం
హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు
తాండూరు, మే 18: సర్కార్ దవాఖానల్లో ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయిలో మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అధిక నిధులు కేటాయించి వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. అందులో భాగంగానే త్వరితగతిన మందులు అందించడం కోసం జిల్లా స్థాయిలో రీజినల్ సబ్ సెంటర్ (సెంట్రల్ డ్రగ్ స్టోర్) ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. దీంతో వికారాబాద్ జిల్లా కేంద్రానికి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి టీబీ ఆస్పత్రిలో రీజినల్ సబ్ సెంటర్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సెంటర్ అందుబాటులోకి వస్తే తాండూరు, వికారాబాద్ మర్పల్లి ప్రధాన దవాఖానలతోపాటు జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు యుద్ధప్రాతిపదికన మందులు అందించడానికి వీలుంటుంది. అయితే మందుల సరఫరాకు ప్రత్యేక వాహనాలను కూడా తక్షణమే ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోర్ వికారాబాద్కు రానుండడంతో రోగులకు సకాలంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. దీంతో పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందనున్నది.
సకల వసతులతో వైద్యం…
సమైక్యరాష్ట్ర ప్రభుత్వాలు వైద్యరంగాన్ని విస్మరించాయి. దీంతో అరకొర వసతులతో రోగులు, సిబ్బంది ఇబ్బంది పడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ప్రత్యేక చొరవతో వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందుతున్నది. పీహెచ్సీ మొదలుకొని రాష్ట్రస్థాయి దవాఖాన వరకు అన్ని వసతులు కల్పించి వైద్య, ఆరోగ్య శాఖ నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పురుడు పోసేవరకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో మాతాశిశు మరణాల రేటు పూర్తిగా తగ్గిపోయింది. ఆపరేషన్ల వరకు పేదలకు తెలంగాణ సర్కార్ అండగా నిలుస్తున్నది.
కరోనా సమయంలో మెరుగైన సేవలు…
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర సర్కార్ దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న సమీక్షలతో అధికారులు, పాలకులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కొవిడ్ రోగులకు సర్కార్ దవాఖానల్లో (ఐసొలేషన్ సెంటర్లు) ఉచిత వైద్యం, భోజన వసతి, మందులు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. తాజాగా అనంతగిరిలో 200 పడకల టీబీ దవాఖానను కొవిడ్ రోగుల చికిత్సకు వినియోగించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మరోవైపు రోగులకు సరిపడా బెడ్స్, ఆక్సిజన్, రెమ్డెసివిర్ మందులు సహా అన్నీ అందుబాటులో ఉంచారు. కరోనా వ్యాక్సిన్ల పంపిణీపై సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. జిల్లాలోని తాండూ రు మాతాశిశు దవాఖానలో మహిళలకు, పురుషులకు, చిన్నారులకు వేర్వేరుగా ప్రత్యేక ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. ఇందులో 75 ఆక్సిజన్ బెడ్లు, 15 ఐసీయూ బెడ్లతో పాటు 18 మంది వైద్యులు, 19 మంది నర్సులతో మూడు షిఫ్ట్ల్లో 24 గంటలూ వైద్య సేవలు అందిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని అనంతగిరి టీబీ శానిటోరియంలో 40 బెడ్లతో కూడిన ప్రత్యేక ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. 20 బెడ్లు మహిళలకు, 20 బెడ్లు పురుషులకు కేటాయించారు. ఇందులో పాజిటివ్ వచ్చి కొద్దిపాటి సింటమ్స్ ఉన్నవాళ్లు, ఇండ్లల్లో స్థలం లేనివారు ఉండేందుకు వెసులు బాటు కల్పించారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు..
పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు, త్వరితగతిన మందులు అందించడం కోసం జిల్లా స్థాయిలో రీజినల్ సబ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవడం అభినందనీయం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు మధ్యలో ఉన్న అనంతగిరి టీబీ కేంద్రంలో రీజినల్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయడంతో జిల్లా ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. విపత్కరమైన పరిస్థితుల్లో ప్రజల బాగు కోసం తపిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు. ప్రభుత్వ సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకోవాలి.
– పి.సునీతారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్
సకాలంలో మందులు..
సర్కార్ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి లో మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు తెలంగాణ సర్కార్ చేస్తున్న కృషి అభినందనీయం. మెరుగైన వైద్య సదుపాయాలు, మందులు అందుబాటులో ఉండేందుకు అనంతగిరిలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఏర్పాటు, సరఫరాకు ప్రత్యేక వాహనాలు సమకూర్చనుండడంతో మేలు జరుగుతుంది. వికారాబాద్లో రీజినల్ సబ్ సెంటర్ ఏర్పాటు చేయడంతో అవసరమైన మందులు గంటలోపు ఆయా ప్రభుత్వ దవాఖానలకు అందనున్నాయి.
-డా.మల్లికార్జున్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్