ఇల్లందకుంట : గౌడన్నల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. అన్ని కులాల ఆర్థిక అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని చెప్పారు. ఆదివారం ఇల్లందకుంట మండలం సిరిసేడులో గౌడ కులస్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. గౌడన్నల కోసం నీరా పాలసీ తీసుకువచ్చినట్టు తెలిపారు. పెన్షన్లు కూడా ఇస్తున్నట్టు వివరించారు.
త్వరలోనే గౌడన్నలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షలు అందజేస్తామని పేర్కొన్నారు. కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాగంగా పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం రవిశంకర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.