హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): కరోనా విపత్తు వేళ.. సదుద్దేశంతో అందిస్తున్న ఆనందయ్య మందుపై అభ్యంతరం ఎందుకని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన జీయర్స్వామి ప్రశ్నించారు. ఎర్రగడ్డలోని ఈఎస్ఐ దవాఖానను ఆదివారం సందర్శించిన ఆయన.. అక్కడి వైద్యసిబ్బందితో పలు అంశాలు చర్చించారు. ‘నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందువల్ల ఎటువంటి దుష్పరిణామాలు లేవంటున్నారు. ఔషధాన్ని కూడా ఉచితంగా ఇస్తున్నపుడు ఇబ్బంది ఎందుకు? ఓ మందు ప్రాణాలు నిలబెడుతుంటే వివాదం ఎందుకు? సంక్షోభం వేళ వివాదాలకు తావివ్వకూడదు..’ అని పేర్కొన్నారు. అల్లోపతి వైద్యాన్ని వ్యవస్థ అంగీకరించిందని, కానీ ప్రజల ఆరోగ్యాలను బాగు చేసే మంచిని ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చని చిన జీయర్ అన్నారు.