కోల్కతా : ఉరుములు, మెరుపులు, పిడుగుల ధాటికి పశ్చిమ బెంగాల్లో 26 మంది మృత్యువాతపడ్డారు. తీవ్రమైన గాలులతో కూడిన వర్షం సోమవారం పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. పిడుగులతో హుగ్లీ జిల్లాలో 11 మంది, ముర్షిదాబాద్లో తొమ్మిది మంది, బంకురా, ఈస్ట్ మిడ్నాపూర్, వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. మృతులకు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2లక్షల, గాయపడ్డ వారికి రూ.50వేల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
కేంద్ర మంత్రి అమిత్ షా సైతం మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దక్షిణ బెంగాల్లోని పలు జిల్లాల్లో సోమవారం సాయంత్రం మెరుపు, ఉరుములతో కూడిన వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. పూర్బా మెదినీపూర్, దక్షిణ 24 పరగణాలు, కోల్కతా, హూగ్లీ, హౌరా, ముర్షిదాబాద్, పురులియా, బంకురా, నదియా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం 37.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన కోల్కతాలో సాయంత్రం 12 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కార్యాలయం తెలిపింది.
నగరంలోని అలిపోర్ అబ్జర్వేటరీ మీదుగా సాయంత్రం వాయువ్య దిశ నుంచి గంటకు 59 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం సైతం కోల్కతాతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తర బెంగాల్లో రుతు పవనాల ప్రభావంతో డార్జిలింగ్, అలీపుర్దువార్లో, బుధవారం ఉదయం వరకు కూచ్బెహార్, కాలింపాంగ్, జల్పాయిగురిల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.