హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మిరప పంట సాగు ఏటేటా పెరుగుతున్నది. ఐదేండ్లలో ఇది రెట్టింపయింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.52 లక్షల ఎకరాల్లో మిర్చి సాగైనట్టు ఉద్యానశాఖ లెక్కలు చెప్తున్నాయి. ఇది మరింత పెరుగొచ్చని అంచనా. గత ఏడాదితో పోలిస్తేనే ప్రస్తుతం 1.12 లక్షల ఎకరాల్లో అధికంగా సాగు కావడం గమనార్హం. మిరప సాగుకు అనుగుణంగానే ఉత్పత్తి కూడా భారీ గా పెరుగుతున్నది. ఈ ఏడాది 7.05 లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తి అవుతుందని ఉద్యానశాఖ అంచనా వేస్తున్నది. మిర్చి పంటకు ఈ మధ్య మంచి ధర వస్తున్నది. క్వింటాకు రూ.12వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలుకుతుండటం గమనార్హం. ఇటీవల ఖమ్మం మార్కెట్లో మిర్చి క్వింటాల్కు అత్యధికంగా రూ.14,100 ధర పలుకగా.. మధ్యస్తంగా రూ.11,200 పలికింది. వరికి ప్రత్యామ్నాయ పంటలపై చర్చ జరుగుతున్న సందర్భంలో మిర్చి సాగు పెరగడం మంచి పరిణామమని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న మిర్చి వంటి పంటల సాగు పెరిగితే.. వరి సాగు తగ్గించడం సులువవుతుందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో మిర్చి పంట సాగుకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలు పేరుగాంచినవి. కానీ ఈ ఏడాది రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో మిర్చి పంట చెప్పుకోదగ్గ స్థాయిలో సాగయింది. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మిర్చి సాగు గతేడాదితో పోల్చితే రెట్టింపయింది. ఖమ్మం జిల్లాలో గతేడాది 58,220 ఎకరాల్లో సాగు కాగా.. ఈసారి ఏకంగా 1,02,252 ఎకరాల్లో సాగైంది. మహబూబాబాద్ జిల్లాలో గతేడాది 47,858 ఎకరాల్లో సాగు కాగా.. ఈసారి 81,552 ఎకరాల్లో సాగు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 34,350 ఎకరాల్లో, భూపాలపల్లి జిల్లాలో 29,663 ఎకరాల్లో, కొత్తగూడెం జిల్లాలో 25,249 ఎకరాల్లో, వరంగల్ రూరల్ జిల్లాలో 27,078 ఎకరాల్లో మిర్చి పంట సాగైంది.