మొయినాబాద్ : కొవిడ్ 19 కారణంగా చిలుకూరు బాలాజీ ఆలయంలో సుమారుగా ఏడాదిన్నర పాటు నిలిచిపోయిన ప్రదక్షణాలు పునఃప్రారంభిస్తామని ఆలయ అర్చకులు రంగరాజన్ తెలిపారు. మంగళవారం అర్చకులు రంగరాజన్ మీడియాతో మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు మహా ప్రాకార ప్రదక్షణలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆలయ గర్భగుడి చుట్టు భక్తులు, 11 లేదా 108 ప్రదక్షణలు చేసేవారని, కరోనా కారణంగా ఏడాదిన్నర నుంచి ప్రదక్షణాలు పూర్తిగా నిలిపివేశామని పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే చాలా మంది భక్తులు ప్రదక్షణల కోసం అర్జిస్తున్నారని, భక్తుల మేరకు ప్రదక్షణాలు చేసేందుకు అవకాశం ఇస్తున్నట్లుగా చెప్పారు.
ఆలయ ప్రకారం చుట్టు ఒక ప్రదక్షణ చేస్తే 11 ప్రదక్షణలు చేసినట్లే అని తెలిపారు. 11 ప్రదక్షణలు చేసి స్వామివారికి మొక్కుకునే భక్తులు ఒక మహా ప్రాకార ప్రదక్షణ చేస్తే సరిపోతుందని అన్నారు. అలాగే 108 ప్రదక్షణలు చేసి మొక్కులు చెల్లించుకునే భక్తులు 11 మహా ప్రాకార ప్రదక్షణలు చేసి మొక్కులు చెల్లించుకోవచ్చాన్నారు. కొవిడ్ 19 పూర్తిగా అంతమొంది సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మహాప్రాకార ప్రదక్షణాలు కొనసాగిస్తామని అన్నారు. ఇట్టి విషయాన్ని భక్తులు గమనించి ఆలయ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు.