అడ్డుకుంటున్న అధికార యంత్రాంగం
నిలువరించిన జిల్లాల్లో వికారాబాద్ టాప్
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): కల్యాణిలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాల కారణంగా తెలంగాణలో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గినప్పటికీ, కరోనా కష్టకాలంలో వీటి సంఖ్య గతం కంటే పెరిగింది. దీంతో బాల్య వివాహాలను నిలువరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తున్నది. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా 1,355 బాల్య వివాహాలను అడ్డుకోవడం విశేషం. అంతకు ముందు ఏడాది వీటి సంఖ్య 977. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 176 బాల్య వివాహాలను ప్రభుత్వ యంత్రాంగం నివారించింది. ఆ తరువాత వనపర్తి, సంగారెడ్డి జిల్లాల్లో 83 చొప్పన, వరంగల్ రూరల్ జిల్లాలో 72 బాల్యవివాహాలను చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం అడ్డుకొని తల్లిదండ్రులకు, పిల్లలకు కౌన్సెలింగ్ నిర్వహించింది. పోషణభారం లేని తల్లిదండ్రుల పిల్లలు ఆయా జిల్లాల్లోని స్త్రీ, శిశు సంక్షేమశాఖ హోమ్స్లో (యువతులు మాత్రమే) ఉండేలా ఏర్పాటుచేసింది. ఇక్కడ వారికి టైలరింగ్, బ్యూటీషియన్ వంటి ఉపాధి విద్యల్లో శిక్షణ ఇప్పించి, ఉపాధికి బాటలు వేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కరోనా నివారణ చర్యల్లో నిమగ్నమైన ప్రస్తుతం తరుణంలో తమ వైపు ఎవరూ రారన్న ఉద్దేశంతో కొందరు బాల్య వివాహాలకు ఒడిగడుగుతున్నారని, తమ దృష్టికి వచ్చినవాటిని ఆపగలుగుతున్నామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు చెప్తున్నారు. బాలల హక్కుల రక్షణ చట్టం ఇతర రాష్ర్టాల కంటే తెలంగాణలో పటిష్టంగా అమలవుతున్నట్టు తెలిపారు. పిల్లల ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా పెద్దల ఒప్పంద పెండ్లిళ్లే ఎక్కువగా అవుతున్నాయని ఆ శాఖలో పేరు చెప్పటానికి నిరాకరించిన ఒక అధికారి వివరించారు.
రాష్ట్రంలో ఆగిన బాల్య వివాహాల పట్టిక
977 ఫిబ్రవరి 2019 నుంచి మార్చి 2020
569 ఏప్రిల్ 2020 నుంచి ఆగస్టు 2020
786 సెప్టెంబర్ 2020 నుంచి మార్చి 2021