హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతీరావు పూలే స్ఫూర్తితోనే దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆర్థిక పురోగతి సాధించేలా, గ్రామీణ, ఆర్థిక వ్యవస్థను బలోపేతంచేసే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. గురుకులాల్లో సాధిస్తున్న ఫలితాలు పూలే స్ఫూర్తితోనేనని సీఎం అన్నారు. కులవివక్షకు వ్యతిరేకంగా సమసమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త, సామాజిక దార్శనికుడు, మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి (11 ఏప్రిల్) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. దేశానికి పూలే అందించిన సేవలను ఈ సందర్భంగా సీఎం స్మరించుకొన్నారు. వర్ణ వివక్షను రూపుమాపటం కోసం, దళిత, బహుజన, మహిళావర్గాల అభ్యున్నతి కోసం, మహాత్మా పూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని సీఎం తెలిపారు. కుల, లింగ వివక్షకు తావులేకుండా, విద్య, సమానత్వం ద్వారానే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడుతాయనే పూలే ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని సీఎం చెప్పారు. కుల వృత్తులకు సామాజిక, ఆర్థిక గౌరవాన్ని పెంపొందించడానికి అనేక కార్యక్రమాలను చేపట్టిందని పేర్కొన్నారు.
పూలే స్ఫూర్తితో పాలన
ఆరున్నరేండ్ల తెలంగాణ స్వయంపాలన పూలే వంటి మహనీయుల స్ఫూర్తితోనే కొనసాగుతున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఏటా దాదాపు రూ.45 వేల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షే మ పథకాలు వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళావర్గాల సమున్నతికి ఉపయోగపడుతున్నాయని అన్నారు. అభివృద్ధి సంక్షే మ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. విద్యారంగంలో తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని వివరించారు. మహాత్మా పూలే విదేశీ విద్యానిధి పేరుతో విదేశీ విద్యను ప్రభుత్వ ఖర్చుతో బడుగు, బలహీనవర్గాలకు అందిస్తున్నామని వివరించారు. బాల్య వివాహాలను కట్టడిచేసేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. మహిళలకు విద్య, వైద్యం, రక్షణ కోసం ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని, సదుపాయాలను మెరుగు పరిచిందని పేర్కొన్నారు.
ఆత్మగౌరవం అనుమడించేలా భవనాలు
హైదరాబాద్లో విలువైన స్థలాలను కేటాయించి తెలంగాణలోని బీసీలు, ఎంబీసీల ఆత్మగౌరవం ఇనుమడించేలా ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆర్థిక పురోగతికి దోహదపడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణ, దేశానికే ఆదర్శంగా నిలువడం వెనుక మహాత్మా పూలే వంటి దార్శనికుల ప్రేరణ ఎంతో ఉన్నదని అన్నారు.
సామాజిక దార్శనికుడు పూలే
స్మరించుకున్న స్పీకర్ పోచారం, మంత్రులు కొప్పుల, వేముల
వెనుకబడినవర్గాల అభ్యున్నతికి కృషిచేసిన సామాజిక దార్శనికుడు జ్యోతిరావు పూలే అని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పూలే 195వ జయంతిని పురస్కరించుకొని శనివారం నివాళి అర్పించారు. కుల, లింగ వివక్షకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందించాలని, విద్య ద్వారానే బలహీనవర్గాలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే నమ్మారని చెప్పారు. అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సమానంగా విద్యను అందిస్తున్నదని గుర్తుచేశారు. వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మరింత ఎదగడమే పూలేకు నిజమైన నివాళి అని తెలిపారు. భూస్వామ్య, కుల, మత వ్యవస్థలు, రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక విప్లవ సేనాని పూలే అని ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణ వాది అని ఒక ప్రకటనలో తెలిపారు. పూలేను ఆదర్శంగా తీసుకొని సీఎం కేసీఆర్ రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి కృషిచేస్తున్నారని వివరించారు. సమాజ పునర్నిర్మాణానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమని ఆర్అండ్డీశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తి గా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని అన్నారు.