కరీంనగర్, మే13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ చొరవతో కరీంనగర్ జిల్లాలో శుక్రవారం నుంచి రూ.2 వేలకే సీటీస్కాన్ సేవలు అందనున్నాయి. ధరలు తగ్గించాలన్న మంత్రి విజ్ఞప్తికి డయాగ్నస్టిక్ కేంద్రాల యజమానులు అంగీకరించారు. కరోనా కట్టడి, తీసుకోవాల్సిన చర్యలపై గురువారం మంత్రి ముందుగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రైవేటు దవాఖానలు, డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వాహకులు, ప్రైవేటు వైద్యులు, సంఘాలతో మాట్లాడారు. అనంతరం గంగుల మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో పనిచేయాలని, ప్రభుత్వం ఆదేశించిన ధరలకే అన్నిరకాల చికిత్స అందించాలని దవాఖానల నిర్వాహకులను కోరినట్టు తెలిపారు. రూ.2 వేలకే సీటీస్కాన్, ఫిల్మ్తోపాటు కావాలంటే రూ.2,200కు ఇవ్వాలని కోరామని, ఆ మేరకు శుక్రవారం నుంచి ఇవ్వడానికి అంగీకరించారని చెప్పారు. కరోనా కట్టడికి జిల్లాలో రెండు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేస్తున్నామని, ఇందుకోసం రెండు వేర్వేరు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ఎవరికైనా ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో బెడ్లు దొరక్కపోతే వాట్సాప్ నంబర్లో సమస్యను విన్నవిస్తే వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. విలేకర్ల సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, నగర మేయర్ సునీల్రావు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.