జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించి తిరుగు ప్రయాణమైన సీఎం కేసీఆర్.. మార్గమధ్యంలో యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో కొద్దిసేపు ఆగి, స్థానికులతో ముచ్చటించారు. సమస్యలపై చర్చించేందుకు తన ఫాంహౌస్కు రావాలని ఆహ్వానించారు. ఫాంహౌస్కు వచ్చిన వారితో మాట్లాడి.. గ్రామ సమస్యలు తెలుసుకొన్న సీఎం కేసీఆర్.. 100 కోట్లు ఖర్చయినా సరే.. వాసాలమర్రిని అంకాపూర్ తరహాలో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.
ఉదయం 9.30 గంటలు! వాసాలమర్రి సర్పంచు పోగుల ఆంజనేయులుకు సీఎంవో నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సీఎం మాట్లాడుతారని చెప్పడంతో సర్పంచు ఒక్కసారిగా ఆనందోద్వేగాలకు గురయ్యారు. బాగున్నవా అంజయ్యా.. అంటూ పలుకరించిన సీఎం.. ఈ నెల 22న తాను వాసాలమర్రికి వస్తున్నానని, సహపంక్తి భోజనం చేసి.. సమస్యలపై మాట్లాడుకుందామని చెప్పారు!
యాదాద్రి భువనగిరి, జూన్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎవరూ ఊహించని విధంగా విలక్షణతో వ్యవహరించడంలో సీఎం కేసీఆర్ది ఓ ప్రత్యేకత. ఏదైనా అంశం లేదా.. సమస్య పరిష్కారంలో పలు సందర్భాల్లో అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు నేరుగా ఫోన్ చేసి, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతీరును స్వయంగా తెలుసుకుంటుంటారు. తాజాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి సర్పంచు పోగుల ఆంజనేయులుకు ఇదే విధంగా ఫోన్చేసి ఆశ్చర్యపరిచారు. శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సర్పంచుకు ఫోన్చేసిన సీఎం.. ఈ నెల 22న తాను వాసాలమర్రికి వస్తున్నట్టు చెప్పారు. గతంలో వద్దామనుకున్నప్పటికీ తనకు కరోనా పాజిటివ్ రావడం.. లాక్డౌన్ పరిస్థితుల్లో వీలుకాలేదని తెలిపారు. ఊరంతా కలిసి భోజనం చేసేందుకు, అనంతరం గ్రామ సమస్యలపై మాట్లాడుకునేందుకు రెండు పెద్ద జాగలు చూడాలని సూచించారు. మొత్తం గ్రామంలో ఎంతమంది ఉంటారని సీఎం ప్రశ్నించగా.. 2,600 మంది జనాభా ఉన్నట్టు సర్పంచు ఆంజనేయులు వివరించారు. ‘3వేల మందికి భోజనం ఏర్పాట్లుచేద్దాం.
ఊరందరికీ భోజనం నేనే పెట్టిస్తా. కులం, మతం, జాతి అన్నభేదం లేకుండా అందరం కలిసి సామూహిక భోజనం చేద్దాం’ అని చెప్పారు. జిల్లా కలెక్టర్ గ్రామానికి వస్తారని.. అందరూ కలిసి ఏర్పాట్లపై చర్చించుకోవాలని చెప్పారు. ‘ప్రతి ఇంటిని బాగు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును చేపడుతున్నం. ఇందులో చిల్లర రాజకీయాలు, పార్టీలు ఉండవు. వాళ్లూ.. వీళ్లూ అన్న వివక్ష వద్దు. వేరే పార్టీల వాళ్లను కూడా కలుపుకొనిపోవాలి. ప్రాజెక్టును సక్సెస్ చేస్తే మంచి పేరొస్తది.. పది టర్మ్లు నువ్వే గెలుస్తావు..’ అని సర్పంచును ఉద్దేశించి సీఎం అన్నారు. తన ఇంటికి కూడా రావాలని సర్పంచు సీఎంను కోరగా.. తప్పక వస్తానని హామీఇచ్చారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి, అన్ని శాఖల జిల్లా అధికారులు వాసాలమర్రిలో పర్యటించి స్థలాలను పరిశీలించారు.
గత ఏడాది అక్టోబర్ 31న సీఎం కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్ల నుంచి వెళుతూ వాసాలమర్రి వద్ద ఆగి, కొద్దిసేపు స్థానికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను ప్రస్తావించగా.. వాటిపై చర్చించేందుకు ఫాంహౌస్కు రావాల్సిందిగా సూచించారు. ఫాంహౌస్కు వచ్చినవారి నుంచి గ్రామ సమస్యలు తెలుసుకున్న సీఎం కేసీఆర్.. అంకాపూర్ తరహాలో రూ.100 కోట్లు ఖర్చు చేసైనా సరే.. వాసాలమర్రి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో అధికారులు వాసాలమర్రిలో పర్యటించి గ్రామాభివృద్ధిపై బ్లూప్రింట్ రూ పొందించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సర్పంచు ఆంజనేయులుకు సీఎం కేసీఆర్ ఫోన్చేసి గ్రామానికి వస్తున్నట్టు తెలిపారు. వాసాలమర్రి అభివృద్ధిపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా వస్తున్నానని తెలిసి గ్రామస్థులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.