హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఎండలు ముదిరిన నేపథ్యంలో పాఠశాలలను ఒంటిపూట నడపాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. ఇందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏటా మార్చి 15 నుంచి ఏప్రిల్ 23వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటలవరకే తరగతులు నిర్వహించేవారు. కరోనా కారణంగా గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్, ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులకు, ఫిబ్రవరి 24 నుంచి 6, 7, 8 తరగతులకు ప్రత్యక్షబోధనను ప్రారంభించారు. ఇటీవలే 6, 7, 8 తరగతులవారికి బోధన ప్రారంభంకావడం, వసతులు సరిపోకపోవడంతో 2,500 పాఠశాలలు షిఫ్ట్ పద్ధతిలో తరగతులను నిర్వహిస్తున్నాయి. 200 పైచిలుకు పాఠశాలల్లో ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఈ నేపథ్యంలో స్కూళ్లు రెండు పూటలా నడిచే అవకాశంలేకపోవడంతో ఒంటిపూట నడపడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతిరాగానే ఒంటిపూట బడులు విధానం అమల్లోకిరానున్నది.
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ ): పాఠశాలల్లోని 6-8 తరగతుల విద్యార్థులకు వచ్చే నెలలో వార్షిక పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నది. ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ), ఒక సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)లను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. ఏప్రిల్ మొదటి, చివరివారాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి 6-8 తరగతుల అకడమిక్ క్యాలెండర్ను సిద్ధంచేశారు. దీనిని త్వరలోనే ప్రభుత్వానికి పంపుతామని, ప్రభుత్వ ఆమోదం రాగానే విద్యాసంవత్సరం, పరీక్షలపై స్పష్టత వస్తుందని అధికారులు వెల్లడించారు. కరోనా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత గత ఫిబ్రవరి 1 నుంచి 9,10 తరగతులకు, అదే నెల 24 నుంచి 6-8 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభమైన విషయం తెలిసిందే. 9,10 తరగతులకు ఎస్సీఈఆర్టీ ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్ను రూపొందించింది.