యాదాద్రి భువనగిరి: ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని రకాల చీరలు ఉన్నప్పటికీ వస్త్రశ్రేణిగా పోచంపల్లి ఇక్కత్ వస్ర్తాలకు ఉన్న స్థానం మాత్రం ప్రత్యేకం. దేశంలో పదకొండు రకాల చేనేతల్లో పోచంపల్లి ఒకటి కాగా..ఇక్కడి కళాకారుల నైపుణ్యతను యావత్ ప్రపంచం మొత్తం ఘనంగా కీర్తిస్తోంది. ప్రపంచం నలుదిశలా వ్యాపించిన పోచంపల్లి కళా ప్రతిభ. .కేవలం పోచంపల్లికే పరిమితం కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు వేలమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. సిల్క్, కాటన్, పట్టు ఫ్యాబ్రిక్లో లభ్యమయ్యే ఇక్కత్ వస్ర్తాలు, మెటీరియల్స్ అందంగా..హుందాగా కనిపించేలా సరికొత్త రంగులతో కాంతులీనుతున్నాయి.
చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్ షీట్స్, లుంగీలు, గృహోపయోగ వస్ర్తాలు..ఇలా ఇక్కత్ ఫ్యామిలీలో ఉన్న బోలెడన్ని వెరైటీలు దేశ, విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి కల్పన రంగమైన చేనేత- జౌళీకి తెలంగాణ ప్రభుత్వం చేయూత నిచ్చి పూర్వ వైభవం కల్పిస్తున్నది. ఇదే క్రమంలో చేనేత కళాకారులు సైతం అసమాన ప్రతిభతో జాతీయ పురస్కారాలను పొంది చేనేత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. తాజాగా..జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, పోచంపల్లి మండలాలకు చెందిన నలుగురు కళాకారులు నలుగురు చేనేత కళాకారులు చీరలపై అద్భుత డిజైన్లు వేసి తెలంగాణ ప్రభుత్వం అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులకు ఎంపికయ్యారు. శనివారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వీరు అవార్డులను అందుకోనున్నారు.
అగ్గిపెట్టెలో పట్టేంత చీరను తయారు చేసిన ఘనత మన నేతన్నలదే. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొందరు కార్మికులు వస్ర్తాల తయారీలో తమకంటూ ప్రత్యేకతను చాటి అవార్డులను సొంతం చేసుకోవడం ద్వారా చేనేత ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేశారు. సంప్రదాయ పరంగానే కాకుండా..మారుతున్న అభిరుచులకి.. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా చేనేత కళాకారులు తమ కళను, నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాకు చెందిన ఎంతో మంది కళాకారులు పద్మశ్రీలతోపాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను అందుకున్నారు. తాజాగా..జిల్లాకు చెం దిన నల్గురు చేనేత కళాకారులు విభిన్నమైన డిజైన్లతో చీరెలను తయారు చేసి చేనేత కీర్తిని మరోసారి చాటారు.
దేశ, విదేశాలకు ఎగుమతి
అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించిన పోచంపల్లి వస్ర్తాలు, డిజైన్ల పట్ల దేశ విదేశాల్లో మగువలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలవబడే పోచంపల్లి చేనేతలో కాటన్, పట్టు, సికో వస్ర్తాలకు ప్రసిద్ది. వీటిలో ఇక్కత్ పట్టు చీరలకు గిరాకీ ఎక్కువ. అమెరికా, స్విట్జర్లాండ్, సింగపూర్, లండన్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు ఇక్కడ తయారైన వస్ర్తాలు ఎగుమతి అవుతున్నాయి.
టాలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రముఖ సినీతారలు, రాజకీయ నాయకులు, ఇతర దేశాల నుంచి విచ్చేసిన మహిళలు సైతం పోచంపల్లి చేనేత కార్మికులు నేసిన చీరలంటే మక్కువ చూపిస్తారు. ఇందిరాగాంధీ, ప్రతిభాపాటిల్ వంటి ప్రముఖులు పోచంపల్లి చీరలను కట్టినవాళ్లే. అమెరికా అధ్యక్ష భవనం, బ్రిటన్ శాసనసభ అలంకరణ కోసం పోచంపల్లి వస్ర్తాలను ఉపయోగించడం..పోచంపల్లి డిజైన్కు ఉన్న ఘనతను తెలియజేస్తుంది. ఒకప్పుడు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లోనే వస్ర్తాలు తయారవ్వగా.. ఇప్పుడు విభిన్న డిజైన్లలో అన్ని రంగుల్లోనూ నేస్తున్నారు.
జిల్లాలో ఘనంగా చేనేత దినోత్సవ ఏర్పాట్లు
జాతీయ చేనేత దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు చేనేత, జౌళి శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, చేనేత కార్మికులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో పలువురు చేనేత కళాకారులను సన్మానించడంతోపాటు, చదువులో అసమాన ప్రతిభ కబబరుస్తున్న పలువురు విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.