మార్కెట్లోకి సరికొత్త పరికరం
బంజారాహిల్స్, ఆగస్టు 25: గాలిద్వారా వ్యాపించే కరోనాతోపాటు.. పలు రకాల వైరస్లను, బ్యాక్టీరియాలను నిరోధించడానికి నూతన పరికరం ఆవిష్కారమైంది. వైరస్లను అడ్డుకోవడంతోపాటు.. స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించడానికి ‘ప్యూర్ ప్రాణ’ పేరుతో సరికొత్త యాంటీవైరస్ పరికరాన్ని ప్యూర్ ప్రాడక్ట్స్ అండ్ డివైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మార్కెట్లోకి విడుదలచేసింది. బుధవారం బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణలో జరిగిన మీడియా సమావేశంలో ఈ పరికరాన్ని రూపొందించిన ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త కేహెచ్ శాస్త్రి మాట్లాడుతూ. 36 ఏండ్లపాటు పరిశోధించి.. నానో టెక్నాలజీతోపాటు అయాన్ ఆధారంగా దీన్ని తయారుచేశామని చెప్పారు. ఈ పరికరానికి సీసీఎంబీ, ఐఐసీటీ తదితర సంస్థల గుర్తింపు లభించిందన్నారు. దేశంలోని 169 దవాఖానలు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఆపరేషన్ థియేటర్లలో ఈ పరికరాన్ని పరీక్షించామని వెల్లడించారు. ఈ పరికరం గాల్లోని ఆక్సిజన్ను గ్రహించడంతోపాటు గాల్లో వ్యాపించిన వైరస్ను, బ్యాక్టీరియాను యూవీ స్పెక్ట్రమ్ టెక్నాలజీ ద్వారా తటస్థం చేసి ఆయాన్లను విడుదల చేయడం ద్వారా శక్తివిహీనం చేస్తుందని తెలిపారు.