వికారాబాద్, జూలై 30: కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్నాయి. మూస పద్ధతులకు స్వస్తి పలికి అధిక దిగుబడులు సాధించేలా రైతులు యాంత్రిక సాగుపై దృష్టి పెడుతున్నారు. వికారాబాద్ జిల్లా కొంపల్లికి చెందిన విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్ ముత్తారెడ్డి క్యారెట్ విత్తే యంత్రం ద్వారా సాగుకు శ్రీకారంచుట్టారు. తమిళనాడులోని కోయంబత్తూరులో తయారుచేసిన రోవర్ సీడింగ్ యంత్రం ద్వారా క్యారెట్ విత్తనాలు వేసి స్థానిక రైతులకు అవగాహన కల్పించారు. సాధారణంగా వెదజల్లుడు పద్ధతిలో క్యారెట్ విత్తనాలు వేస్తారు. దీంతో విత్తనాలు వృథా అవుతాయి. కానీ, రోవర్ సీడింగ్ యంత్రం క్రమపద్ధతిలో నాటడంతో విత్తన వృథాకు అవకాశం ఉండదు. విత్తు విత్తుకు మధ్య 3 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటుతుంది. దీంతో ఎక్కువ మొక్కలు నాటుకొని దిగుబడి పెరుగుతుంది. ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల సాయంతో యంత్రం పనిచేస్తుంది. తద్వారా రైతులకు కూలీ ఖర్చు సైతం మిగులుతుంది. ఈ యంత్రం బరువు 20 కిలోలు ఉండగా, ధర రూ.67 వేలుగా ఉంది. రాష్ట్రంలో మొదటిసారిగా వికారాబాద్ జిల్లా కొంపల్లిలో యంత్రంతో సాగు చేపట్టారు. కొంపల్లి, గెరిగెట్పల్లి, కొత్తగడి, పెండ్లిమడుగు రైతులు శుక్రవారం ఈ యంత్రం పనితీరును తెలుసుకున్నారు. సాధారణ పద్ధతిలో నాటితే కేవలం 6 టన్నుల దిగుబడి వస్తుందని, యంత్రం ద్వారా అయితే 25 టన్నుల వరకు దిగుబడి వస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.