హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ)/మాదాపూర్: భవిష్యత్తు అం తా ఎలక్ట్రిక్ యుగమేనని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. వాయు, శబ్ద కాలుష్య సమస్యను ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా తగ్గించవచ్చని తెలిపారు. శుక్రవారం హైటెక్స్లో ఈవీ ట్రేడ్ ఎక్స్పోను జగదీశ్రెడ్డి ప్రారంభించారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని స్వయంగా నడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ అధిక వినియోగంతో కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకొంటున్నామని అన్నారు. 10వేల ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం ద్వారా ఏటా రూ.250 కోట్లు ఆదా చేయవచ్చని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రొత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చిందని గుర్తుచేశారు. బ్యాటరీల తయారీని ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలు ప్రకటించామని తెలిపారు. తెలంగాణలో విద్యుత్తు సమస్యలేదని చెప్పారు. మొదట 600 ఈవీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటుచేయాలని లక్ష్యం గా పెట్టుకొని, ఇప్పటికే 138 ఏర్పాటు చేశామని వెల్లడించారు. జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈవీ తీసుకున్నారని, తాను కూడా ఒక వాహనాన్ని పరిశీలించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, రెడ్ కో ఎండీ జానయ్య తదితరులు పాల్గొన్నారు.