జిల్లాలో 6,866 మందిని గుర్తించాం
ప్రతిరోజు బాధితుల ఇంటికి వెళ్లి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి
ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు కొనసాగించాలి
వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ నిఖిల
జనగామ రూరల్, మే 18: ఇంటింటా జ్వరసర్వేలో కరోనా లక్షణాలు గుర్తించి, హెల్త్ కిట్లు అందించిన వారి ఆరోగ్య పరిస్థితిని రోజూ పరిశీలించాలని కలెక్టర్ కే నిఖిల అన్నారు. కరోనా నియంత్రణ చర్యలపై జిల్లా అధికారులు, వైద్యాధికారులు, తహసీల్దార్లతో మంగళవారం ఆమె జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 6 నుంచి 15 వరకు ఇంటింటా ఆరోగ్య సర్వేను పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో 1,61,287 కుటుంబాలు ఉన్నాయని, ఇందులో కొవిడ్ లక్షణాలు 6,866 మందికి ఉన్నట్లు గుర్తించామన్నారు. అదేవిధంగా ప్రతి ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్లు, ఎంసీహెచ్ఎస్, జిల్లా ప్రధాన దవాఖానలో కొవిడ్ ఓపీ సేవలు చేపట్టి, లక్షణాలున్న 2,641 మందికి వైద్య సేవలు అందించి, మొత్తం 9,507 మందికి హోం హెల్త్ కిట్లు అందజేసి కొవిడ్ చికిత్స ప్రారంభించినట్లు వివరించారు. హోం హెల్త్కిట్లు అందజేసిన వారి జాబితా ప్రకారం నేటి నుంచి ప్రతిరోజు వారి ఇంటికి వైద్య సిబ్బంది థర్మల్ స్క్యానర్, పల్స్ ఆక్సీమీటర్లతో వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని, ఆరోగ్యం మెరుగుపడని వారికి స్థిరాయిడ్ వాడమని సూచించడం, వైద్యపరంగా సలహాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వైద్యాధికారులు ప్రతిరోజు వారివారి పరిధి జాబితాలోని 10 మంది ఇండ్లకు స్వయంగా వెళ్లి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలన్నారు.
మనోధైర్యం కల్పించాలి
అవసరమైన వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, జాగ్రత్తలు తెలిపి వారిలో మనోధైర్యం కల్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్ సిలిండర్ ఎప్పుడూ నిండుగా ఉండేలా చూడాలన్నారు. ఎవరైనా ఆక్సిజన్ కావాల్సిన పరిస్థితుల్లో ఆరోగ్య కేంద్రానికి వస్తే వారిని మెరుగైన చికిత్సకు పై దవాఖానకు రెఫర్ చేసి, ఆలోగా బాధితుడి ఆరోగ్యం విషమించకుండా ఆక్సిజన్ అందించి జాగ్రత్తలు తీసుకోనేలా పీహెచ్సీలు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఓపీ సేవలు కొనసాగించాలని ఆదేశించారు. వైద్యాధికారులు, సిబ్బందితోపాటు అవసరమైన వారి నియామకానికి చర్యలు తీసుకోవాలన్నారు. వెంటిలేటర్లను ఆపరేటింగ్ చేసే టెక్నీషియన్ను వెంటనే నియమించుకోవాలని సూచించారు. సరిపడా మందుల నిల్వలు ఉండాలన్నారు.
ఆక్సిజన్ వృథాను అరిట్టాలి
ఆక్సిజన్ వృథాను అరికట్టాలని, తేలికపాటి లక్షణాలు ఉన్న వారికి ఆక్సిజన్ కాన్సంట్రేట్లు వాడాలని కలెక్టర్ అన్నారు. ఆక్సిజన్ బెడ్లు పెంచాలని, తేలికపాటి లక్షణాలు ఉన్న వారికి సీహెచ్సీలోనే వైద్య సేవలు అందించాలన్నారు. మండలానికి ఒక ఐసొలేషన్ కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపారు. వాటిని శుభ్రం చేయించి దూరం దూరం బెడ్లు వేసి సిద్ధంగా ఉంచాలన్నారు. తహసీల్దార్లు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో హోం క్వారంటైన్కు వీలులేని వారిని ఐసొలేషన్ కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యాధికారులు తహసీల్దార్లతో ప్రతిరోజు కాంటాక్ట్లో ఉండాలన్నారు. తహసీల్దార్, ఎంపీడీవో, వైద్యాధికారి, సబ్ ఇన్స్పెక్టర్లతో కూడిన మండల అధికారుల బృందం ఎక్కువ పాజిటివ్ కేసులున్న గ్రామాల్లో పర్యటించి ప్రజల్లో అవగాహన కల్పించడం, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టడం, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి కరోనా నియంత్రణ చర్యలు పాటించేలా చైతన్యం కల్పించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యాధికారులు, అధికారులు ప్రజలకు సేవలందిస్తూ వారికి అండగా నిలువాలని, కొవిడ్ను జయించేలా వారిలో మనోనిబ్బరాన్ని కల్పించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్సలో అదనపు కలెక్టర్లు ఏ భాస్కర్రావు, అబ్దుల్ హమీద్, డీఎంహెచ్వో డాక్టర్ మహేందర్, డీసీహెచ్వో డాక్టర్ రఘు పాల్గొన్నారు.