హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): పంట ఏదైనా సాగులో ముందుగా ముఖ్యమైనది విత్తనం. మేలైన విత్తనం విత్తితేనే దిగుబడి బాగా వచ్చి రైతుకు విత్తం మిగులుతుంది. సాగు సీజన్ దగ్గరపడటంతో మార్కెట్లోకి నకిలీ విత్తనాలు కూడా వస్తున్నాయి. ఇటు విజిలెన్స్ అధికారులు, అటు పోలీసులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నా.. కొన్ని కంపెనీలు అసలుకు తేడాలేకుండా నకిలీ విత్తనాల ప్యాకెట్లను మార్కెట్లో అమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో విత్తనాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా పత్తి, సోయాబీన్, మిర్చి, వరి విత్తనాల్లో అధికంగా ఉంటున్నది. ఇటీవల కంది విత్తనాలు కూడా నకిలీవి వస్తున్నాయి. ఈ పంటలను ఎక్కువగా సాగు చేస్తుండటాన్ని అదునుగా తీసుకుంటున్న కొన్ని ముఠాలు రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాల వ్యాపారానికి తెరలేపుతున్నాయి. మరీ ముఖ్యంగా పత్తి పంటపై నకిలీ విత్తనాల ప్రభావం ఎక్కువగా ఉంటున్నది. ప్రస్తుతం మార్కెట్లో బీజీ-2 పత్తి విత్తనాలకు మాత్రమే అనుమతి ఉంది. కానీ దళారులు బీజీ-2 పేరుతో బీజీ-3 (హెచ్టీ-హెర్బిసైడ్ టోలరెంట్) విత్తనాలను విక్రయిస్తున్నారు. వాస్తవానికి మన దేశంలో బీజీ-3 (హెచ్టీ) విత్తనాలపై నిషేధం ఉన్నది. దళారులు మహారాష్ట్ర, గుజరాత్ నుంచి పెద్ద మొత్తంలో హెచ్టీ కాటన్ విత్తనాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
రైతులు విత్తనాలు కొనుగోలు చేసేప్పుడు కచ్చితంగా రశీదు తీసుకోవాలి. నకిలీని అడ్డుకొనేందుకు మా సంస్థ నుంచి వచ్చే విత్తన ప్యాకెట్లు, సంచులపై దేశంలోనే తొలిసారి క్యూఆర్ కోడ్ ముద్రించాం. ఈ కోడ్లో ఆ విత్తనానికి సంబంధించిన పూర్తి వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. దీంతో నకిలీకి ఎలాంటి ఆస్కారం ఉండదు. ఇదేతరహాలో అన్నిరకాల విత్తన వ్యాపారులు కూడా క్యూఆర్ కోడ్ అమలుచేస్తే ఇక నకిలీ విత్తనాలకు పూర్తిస్థాయిలో చెక్పెట్టే అవకాశం ఉంటుంది.
డా. కేశవులు, ఎండీ, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ