హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము చివరకు చేరేది వారి బ్యాంకు ఖాతాలకే. వాటిని గుర్తించి, ఎక్కడికక్కడ ఫ్రీజ్ చేస్తే దోపిడీని దాదాపు అడ్డుకున్నట్టే. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) సహకారంతో హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ఇదే పద్ధతిని పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా అమలు చేస్తున్నారు. సైబర్ నేరాల నియంత్రణపై కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆ వివరాలను జాయింట్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. సైబర్ దాడులకు పాల్పడేవాళ్లు ఇతర రాష్ర్టాల్లోనే ఎక్కువ. వాళ్లు ఉపయోగించే బ్యాంకు ఖాతాలు బినామీలవి. నేరగాళ్లు కమీషన్ పద్ధతిలో ఆ ఖాతాలను దోపిడీకి వాడుకుంటారు. డబ్బు ఆశతో బినామీలు ఒక్కొక్కరు పది, పదిహేను బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. బ్యాంకు ఖాతా తెరిచే సమయంలో ఆధార్ కార్డు తప్పనిసరి కావటంతో అన్ని ఖాతాలకు ఆధార్ లింక్ అయ్యి ఉంటుంది. ఇదే పోలీసులకు ప్రధాన అస్త్రం. నేరగాడు ఏ బ్యాంకు ఖాతా అయితే ఉపయోగించాడో ఆ ఖాతాపైనే దర్యాప్తు అధికారులు దృష్టిపెట్టారు. ఖాతా తెరిచే సమయంలో ఇచ్చిన వివరాలతో దేశవ్యాప్తంగా ఎన్ని ఖాతాలు తెరిపించాడనే విషయాన్ని ఎఫ్ఐయూ ద్వారా తెలుసుకోగా, ఒక్కో ఆధార్ కార్డుపై 15 దాకా ఖాతాలు బయటపడ్డాయి. వీటన్నింటినీ పోలీసులు ఫ్రీజ్ చేశారు. దీంతో నేరం చేసేవారికి బినామీ అకౌంట్లు లేకుండా పోతున్నాయి. ఆయా బ్యాంకు ఖాతాలను విశ్లేషిస్తే బాధితుల సమాచారం కూడా తెలుస్తున్నది. అన్ని కేసుల్లోనూ ఇలా చేయటం ద్వారా ఖాతాల వివరాలు, లింక్లు బయటపడి సైబర్ నేరగాళ్ల దోపిడీకి కళ్లెం పడుతుంది.