అచ్చంపేట : చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోడానికి వీలు లేదని అలాంటి వారిపై చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ హెచ్చరించారు. బల్మూర్ మండలం చెంచుపల్లి తాండా గిరిజనులపై అటవీశాఖ సిబ్బంది దాడి చేసి తీవ్రంగా గాయపరచిన సంగతి తెలిసిందే. కలెక్టర్ శనివారం మధ్యాహ్నం అచ్ఛంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఘటన గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని బాధితులకు భరోసా కల్పించారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా మహిళలని కూడా చూడకుండా తీవ్రంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు.
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ మాట్లాడుతూ.. పండగ సందర్బంగా ఇప్పపూలు ఎరుకోడానికి అడవికి వెళ్లిన చెంచుపల్లి తాండా వాసులు 14 మంది మహిళలు, 9 మంది పురుషులు. అందరూ 50-60 సంవత్సరాల వయస్సు కలిగిన వారు. వారిని రాత్రి సమయంలో నిద్రావస్థలో ఉండగా అటవీశాఖ సిబ్బంది అమానవీయంగా దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్న చెంచు, లంబాడీలపై అటవీశాఖ సిబ్బంది ఇలా దాడులు చేయడాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షలు పడే విధంగా చూస్తామన్నారు.