డీఆర్డీవోలో కొలువుల పేరిట ఘరానా మోసం
వనస్థలిపురం, ఏప్రిల్ 12: రక్షణశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఘరానామోసానికి తెరలేపాడో కేటుగాడు. దాదాపు రూ.3 కోట్లకు పైగా వసూలుచేసి పరారయ్యాడు. ఏపీలోని గుంటూరుజిల్లా తెనాలికి చెందిన సాయినాథ్ అలియాస్ రఘోత్తమ.. హైదరాబాద్కు వలసవచ్చాడు. డీఆర్డీవో డైరెక్టర్ సదానందచారికి పీఏగా పనిచేస్తున్నానని, పెద్ద అధికారులతో సంబంధాలున్నాయని చెప్పి నిరుద్యోగులను బుట్టలో పడేశాడు. హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతంలో పలువురు నిరుద్యోగులనుంచి డబ్బులు వసూలుచేసి ఒరిజినల్ లెటర్లను తలదన్నేలా అపాయింట్మెంట్ లెటర్లు సృష్టించాడు. డీఆర్డీవో అధికారుల రబ్బర్స్టాంపులు తయారుచేసి ఆ లెటర్లపై ముద్రించి అందించాడు. అధికారుల సంతకాలు కూడా తానే చేశాడు. చివరకు ఇంటి పనిమనిషి నుంచి కూడా రూ.1.5 లక్షలు వసూలుచేశాడు. దాదాపు 122 మందికి ఈవిధంగా దొంగ నియామక పత్రాలు అందించాడు. చివరకు తనపై ఒత్తిడి పెరగడంతో ఫోన్ స్విచ్ఆఫ్ చేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.