హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతలకు ఎన్నికలు వచ్చినప్పుడల్లా తాలిబన్లు, రోహింగ్యాలు గుర్తుకొస్తారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో బీజేపీ అధ్యక్షుడు బండి.. పాతబస్తీలో రోహింగ్యాలున్నారని, సర్జికల్ స్ట్రైక్చేస్తామని ప్రకటించారని, ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికలు రాగానే ఆ పార్టీ నేత మురళీధర్రావు హైదరాబాద్లో తాలిబన్లు ఉన్నారని పేర్కొనటం సిగ్గుచేటని చెప్పారు. రోహింగ్యాలు, తాలిబన్లు దేశంలోకి చొరబడకుండా అడ్డుకోవాల్సింది కేంద్రమేనని స్పష్టంచేశారు. అక్రమంగా చొరబడుతుంటే కేంద్రమేమైనా గడ్డిపీకుతున్నదా? అని నిలదీశారు. ప్రజలను రెచ్చగొట్టే మాటలు బంద్ చేయాలని బీజేపీకి హితవు పలికారు.
ఈటల రాజేందర్ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించా రు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని పలువురు శనివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు దళితబంధుపై పూటకో చేతకాని మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఆ రెండు జాతీయ పార్టీలు తమ అధిష్ఠానాలతో.. ఆర్నెళ్లలో దళితులకు, బీసీలకు, గిరిజనులకు రూ.10 లక్షల చొప్పున అందజేస్తామని లేఖలు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
జాతీయ పార్టీలు లిఖితపూర్వక హామీ ఇస్తే.. వారికి ఆర్నెళ్లు ప్రభుత్వాన్ని అప్పగించేలా తాను ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పారు. లేఖలు ఇప్పించకపోతే బీజేపీ, కాంగ్రెస్.. తెలంగాణ గడ్డపై ఏ ఎన్నికల్లోనూ పోటీచేయొద్దని సవాల్ విసిరారు. దళితబంధును మూడేండ్లలో అన్ని దళిత కుటుంబాలకు ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్తుంటే.. విపక్ష నేతలు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని వేషాలు వేసినా వారికి అధికారం రాదని స్పష్టంచేశారు.