హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల జీవిత బీమా పాలసీల్లో ప్రభుత్వం మార్పు లు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, నూతన పీఆర్సీ అమ లు నేపథ్యంలో గరిష్ఠ వయో పరిమితి, స్లాబుల ప్రీమియంలో మార్పులు చేస్తూ ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ విరమణ వయసు 58 ఏండ్లుగా ఉన్నప్పుడు గరిష్ఠంగా 53 ఏండ్ల వరకు మాత్రమే ప్రీమియం చెల్లిం చే అవకాశం ఉండేది. రిటైర్ అయిన తర్వాత ఆ ప్రయోజనాలు పొందేవారు.
తాజాగా పదవీ విరమణ వయసును 61 ఏండ్లకు పెంచడంతో ప్రీమియం చెల్లింపు గరిష్ఠ వయసును 56 ఏండ్లకు పెంచారు. కనిష్ఠంగా ప్రీమియం చెల్లింపు వయసును సైతం గతంలో 21 ఏండ్లుగా ఉండగా 19కి తగ్గించారు. దీని ప్రకారం ఇకపై ఉద్యోగులు 19వ ఏట ప్రీమియం చెల్లింపును ప్రారంభించి, 56 ఏండ్ల వరకు కట్టుకోవచ్చు. దీంతోపాటు నూతన పీఆర్సీ నేపథ్యంలో స్లాబ్ రేట్లను, ప్రీమియం చెల్లింపులను సవరించారు. 56 ఏండ్లలోపు వయసుండి పాలసీలు కడుతున్న ఉద్యోగులు మరిన్ని పాలసీలు తీసుకొని చెల్లింపులను పెంచుకునేందుకు కూడా అవకాశం కల్పించారు.
56 ఏండ్లు దాటినవారికి ఆ అవకాశం లేదు. ప్రస్తుతం 58ఏండ్లు దాటి, పదవీ విరమణ కాలం పొడిగింపుతో లబ్ధిపొందుతున్న ఉద్యోగులు ప్రీమియం చెల్లించాలనుకుంటే మూల వేతనంలో 20 శాతం లేదా గరిష్ఠంగా రూ.20 వేలు (ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని) చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఈ మార్పులు ఈ నెల నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ప్రీమియం చెల్లిస్తున్న ఉద్యోగులు తాజా ప్రీమియాలకు అనుగుణంగా ‘ప్రపోజల్ ఫామ్’ను సమర్పించాల్సి ఉంటుంది.