న్యూఢిల్లీ: సోషల్ మీడియా జెయింట్ ఫేస్బుక్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. కొన్ని రోజులుగా నడుస్తున్న ఓ హ్యాష్ట్యాగ్ను ఆ సంస్థ తాత్కాలికంగా తొలగించడమే దీనికి కారణం. ఫేస్బుక్లో కొన్నాళ్లుగా #ResignModiతో పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ను ఊహించడంలో విఫలమవడంతోపాటు ఆక్సిజన్ వంటి కనీస వైద్య సదుపాయాలను కొవిడ్ పేషెంట్లు అందించడంలో విఫలమైన ప్రధాని మోదీ పదవిలో నుంచి దిగిపోవాలంటూ నెటిజన్లు ఈ హ్యాష్ట్యాగ్ను వైరల్ చేశారు.
అయితే ఈ హ్యాష్ట్యాగ్తో ఉన్న పోస్టులను ఫేస్బుక్ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో కొన్ని గంటల తర్వాత #ResignModiని మళ్లీ రీస్టోర్ చేసింది. అయితే భారత ప్రభుత్వం చెప్పడం వల్లే ఈ హ్యాష్ట్యాగ్ను ఫేస్బుక్ తొలగించిందన్న విమర్శలు రావడంతో ఆ సంస్థ వివరణ ఇచ్చింది. పొరపాటున దీనిని బ్లాక్ చేశామే తప్ప ప్రభుత్వ ఒత్తిడితో కాదు. అందుకే వెంటనే దానిని రీస్టోర్ చేశామని స్పష్టం చేసింది.
దేశంలో కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్పై కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ మధ్యే ట్విటర్ కూడా కొవిడ్ సంబంధిత పోస్ట్లు డిలీట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఫేస్బుక్పైనా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలసిందే. రోజుకు 3 లక్షలకుపైగా కేసులు నమోదువుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ఏకంగా 30 లక్షలు దాటింది.