‘ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. ‘మహానటి’, ‘ధోనీ’తో పాటు జీవితకథలతో వచ్చిన సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ములాయం సింగ్ యాదవ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది’ అని అన్నారు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి. అమిత్ సేథీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మై ములాయం’. మీనా సేథీ నిర్మాత. సువేందు రాజ్ఘోష్ దర్శకుడు. ఈ చిత్రాన్ని గువ్వల భరత్కుమార్, కొత్తకుర్మ శివకుమార్ తెలుగులో అనువదించబోతున్నారు. ఈ చిత్రాన్ని ఇటీవల హైదరాబాద్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘ములాయంసింగ్ రాజకీయ ప్రయాణం, సమాజ్వాదీ పార్టీస్థాపనతో పాటు ఆయన జీవితంలోని కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన చిత్రమిది. అవినీతి పారద్రోలి, సమసమాజ స్థాపన కోసం ములాయం సింగ్ సాగించిన పోరాటం ఆధారంగా స్ఫూర్తిదాయకంగా ఈ సినిమా ఉంటుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొంతు శ్రీదేవి, గోపీనాథ్రెడ్డి, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.