హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): పర్యావరణ దినోత్సవం పచ్చని పండుగకు వేదికైంది. రాష్ట్రంలో ఊరూవాడా అన్న తేడా లేకుండా మొక్కలు నాటడంతో పుడమి మురిసిపోయింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అటవీశాఖ, గ్రీన్ ఇండియా చాలెంజ్ , ఇతర సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శనివారం పెద్దసంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ దంపతులతో కలిసి మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న ఎంపీ సంతోష్కుమార్ను తమిళిసై అభినందించారు. మంచి సంకల్పంతో ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ మరింత ముందుకుసాగాలని ఆకాంక్షించారు. ఇందుకు తనవంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్ అందజేసిన వృక్షవేదం పుస్తకాన్ని ఆమె పరిశీలించారు. గ్రీన్ చాలెంజ్ సాధించిన విజయాలను తెలుసుకుని ఎంపీని ప్రశంసించారు. గ్రీన్ చాలెంజ్ను యజ్ఞంలా కొనసాగిస్తున్నందుకు శాలువా, జ్ఞాపికతో ఆయనను సత్కరించారు.
ప్రతి ఒక్కరూ మొక్కలునాటాలి: ఎంపీ సంతోష్
పర్యావరణ దినోత్సవం సందర్భంగా గజ్వేల్లోని ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఎంపీ సంతోష్కుమార్.. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందగౌడ్, ఎమ్మెల్సీలు కుర్మయ్య, నవీన్రావు, శంభీపూర్ రాజు తదితరులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంతోష్కుమార్ మాట్లాడుతూ.. రోజురోజుకు పర్యావరణంలో చోటుచేసుకుంటున్న ప్రతికూల మార్పులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ పెద్దఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసమే గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. సంస్థ చేస్తున్న కృషికి అందరి తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. దేశం మొత్తం పచ్చదనాన్ని పెంపొందించడానికి ఎంపీ సంతోష్కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ కొనియాడారు. అనంతరం కళాశాల ఆవరణలో ఉన్న వివిధ రకాల మొక్కలు, వాటినుంచి ఉత్పత్తయిన ఔషధాలు, జరుగుతున్న పరిశోధనలను వారు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా తన జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రీన్ చాలెంజ్లో భాగంగా ఎమ్మెల్సీ నవీన్రావు మొక్కలు నాటారు. కార్యక్రమంలో అటవీ కళాశాల డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిశోర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పర్యావరణ పరిరక్షణపై వివిధశాఖల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డి గజ్వేల్లోని అటవీప్రాంతంలో మొక్కలు నాటారు. పీసీసీఎఫ్ ఆర్ శోభ నెహ్రూ జూలాజికల్ పార్క్లో మొక్కలు నాటి.. అడవి దున్న, ఖడ్గమృగానికి పుట్టిన కూనలకు పేర్లు పెట్టారు. అడవిదున్నకు పుట్టిన మగబిడ్డకు కుమ్రంభీం, ఖడ్గమృగం పిల్లకు నంద అని నామకరణం చేశారు. మరోవైపు, గోషామహల్లో మొక్కలు నాటిన సీపీ అంజనీకుమార్.. ఎంపీ సంతోష్కుమార్ నేతృత్వంలోని గ్రీన్ ఇండియా చాలెంజ్ తనకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు.
గ్రీన్ చాలెంజ్కు అద్భుత స్పందన: కోలేటి
ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్చాలెంజ్కు దేశవ్యాప్తంగా అద్భుత స్పందన వస్తున్నదని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. తన జన్మదినం సందర్భంగా శనివారం డీజీపీ కార్యాలయ ప్రాంగణంలో ఆయన మొక్క నాటారు. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ సంజయ్కుమార్ జైన్, ఐపీఎస్, చీఫ్ ఇంజినీర్ టీ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.