హైదరాబాద్ : జీవాలకు మరిన్ని మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు పశుసంవర్థక శాఖ కృషి చేస్తున్నదని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పశుసంవర్థకశాఖకు ఎనలేని గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.
గతంలో కాంట్రాక్ట్ పద్ధతిన నియమించిన 75 మంది వైద్యుల పదవీకాలాన్ని మరో ఏడాది వరకు పొడిగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించిందని గుర్తుచేశారు.
జీవాల వద్దకే వైద్య సేవలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇప్పటికే 100 సంచార పశువైద్య శాలలను ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో శిథిలావస్థలో ఉన్న పశువైద్యశాలలను గుర్తించి తొలి విడుతలో 500కుపైగా వైద్యశాలల ఆధునీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.
అన్ని పశువైద్యశాలల్లో మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పశుగ్రాసం కొరత ఏర్పడకుండా రైతులకు సబ్సిడీపై గడ్డి విత్తనాలను పంపిణీ చేయడంతోపాటు శాఖకు చెందిన ఖాళీస్థలాల్లో గడ్డి పెంపకం చేపడుతున్నట్లు చెప్పారు.
ఉపాధిహామీ పథకం కింద గొర్రెలు, పశువుల పెంపకందారులకు ఉచితంగా షెడ్లను నిర్మించి ఇస్తున్నట్లు గుర్తుచేశారు. పశుసంవర్థకశాఖకు భారీగా నిధులు కేటాయించి శాఖ మరింత బలోపేతానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ర్రైతుల పక్షాన ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.