హిమాయత్నగర్, సెప్టెంబర్ 11: చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని అఖిల భారతీయ ధోబీ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా వీరేశం, కార్యనిర్వాహక అధ్యక్షుడు చిరుకలి శంకర్ కొనియాడారు. శుక్రవారం హైదరాబాద్లోని హిమాయత్నగర్లో ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిజాంనిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నదన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మహాసంఘ్ సహాయ కార్యదర్శి ఎర్ర కృష్ణ, నాయకులు శ్రీనివాస్, బాలమణి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.