హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): వివిధ పథకాల కింద తెలంగాణకు ఇచ్చిన నిధులను రాష్ట్రప్రభుత్వం దుర్వినియోగం చేయలేదని కేంద్రం ప్రకటించింది. జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ (జీఎఫ్ఆర్) ప్రకారమే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఉన్నాయని స్పష్టంచేసింది. బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అడి గిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ సోమవారం లిఖితపూర్వక సమా ధానమిచ్చింది. కేంద్రం ఏడేండ్లలో తెలంగాణకు ఇచ్చిన నిధులెన్ని? వాటికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లను రాష్ట్రం సమర్పించిందా? దుర్వినియోగం చేసిందా? వంటి వివరాలివ్వాలని బండి సంజయ్ కేంద్రాన్ని కోరారు. తెలంగాణకు 2014-15 నుంచి 2020-21 మధ్య ఏడేండ్లలో పన్నుల్లో వాటా రూపంలో రూ.99,076 కోట్లు, వివిధ పథకాలకు గ్రాంట్ ఇన్ఎయిడ్ రూపంలో రూ.64,624 కోట్లు ఇచ్చినట్టు కేంద్రఆర్థికశాఖ తెలిపింది. ఇందులో వినియో గించిన మొ త్తానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించిందని వెల్లడించింది.
కేంద్రం నిధులను తెలంగాణ ప్రభుత్వం ఇతర పథకాలకు దారి మళ్లిస్తున్నదని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ నేతలు కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు. కానీ, ఇప్పుడు స్వయంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే నిధుల దుర్వినియోగం జరుగలేదని స్పష్టం చేసింది. బీజేపీనేతలు ఇప్పుడేం చెప్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.