ఆ రోజు.. రమణశాస్త్రి ఇంటిల్లిపాదీ మౌనంగా వున్నారు. విశ్వనాథ్ నిర్ణయం వల్ల అందరూ కంగుతిన్నారు. ధూపదీప నైవేద్యాలు కూడా పెట్టలేదు. ప్రతిరోజూ ఘుమఘుమల వంటకాలతో ఇంటినిండా ఉండే పొగ లేదు. పూజగదిలోంచి వినిపించే గంటల శబ్దం కూడా ఆగిపోయింది.
రమణశాస్త్రి కట్టె ఊయలలో కూర్చొని ఉన్నాడు. అవమానంతో ఎర్రబడ్డ ఆయన మొహం మరింత గంభీరంగా మారింది.
విశ్వనాథ్ నెమ్మదిగా వచ్చి తండ్రి ముందర నిలబడ్డాడు.
“నాన్న గారు.. మీకిష్టం లేకుంటే వద్దు..” అన్నాడు భయం భయంగా..
“మీ నాన్నగారికి ఈ జిల్లాలో ఎంత గొప్ప పేరుందో నీకు తెలుసుగదరా విశ్వా..” వంటింటి తలుపు దగ్గర నిల్చొని అంది తల్లి మహాలక్ష్మి.
విశ్వనాథ్ తలొంచుకొని నిలబడ్డాడు.
“ఈ పేరు.. ప్రఖ్యాతులు కడుపునింపవు కదా..” అన్నాడు విశ్వ.
“అయితే.. నీకు బతకడానికి, నాలుగు మెతుకులు మింగడానికి ఇంతకన్నా వేరే దారే దొరక లేదా..” కోపంగా అన్నాడు రమణశాస్త్రి.
రమణశాస్త్రి అసహనంగా కదిలాడు.
“అలాగనీ.. మన కుటుంబ సంస్కృతీ సాంప్రదాయం మంటగలిపే పనులే చేసుకోవాలా? ఈ ప్రపంచంలో చేసుకోవాలంటే చాలా పనులున్నాయి” రమణ శాస్త్రి కోపం చూసి విశ్వ భయపడ్డాడు.
విశ్వ నిర్ణయాన్ని రమణశాస్త్రి జీర్ణించుకోవట్లేదు.
మళ్ళీ ఏదో చెప్పబోయాడు విశ్వ..
“నా కండ్లముందు కనబడకు.. నిన్ను చూస్తేనే అసహ్యంగా వుంది నాకు..” అరిచినట్టు అన్నాడు రమణశాస్త్రి.
విశ్వనాథ్ దీనంగా తల్లివైపు చూసాడు.
ఆమె ‘నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరా’ అన్నట్టు కండ్లతోనే బాధగా చెప్పింది.
అప్పటికి మధ్యాహ్నం మూడు దాటింది. రమణశాస్త్రి స్నానం కూడా చేయలేదు.
“సరే.. మీరన్నట్లుగానే కానీయ్..” విశ్వ చెప్పేసి, విసురుగా బయటకు వెళ్ళిపోయాడు.
***
రాత్రి ఏడయింది..
రమణశాస్త్రి ఉయ్యాలపైనే ఒరిగి ఆలోచిస్తూ ఉన్నాడు.
అప్పటికే ఆ వార్త ఊర్లోకి చేరడంతో, అగ్రహారం అంతా అట్టుడికి పోయింది. ఒక్కొక్కరు మెల్లిగా రాసాగారు. అందరూ అదేదో పాపం చేసినట్టు మాట్లాడటం రమణశాస్త్రికి లోలోపల నచ్చలేదు.
“రమణా.. విశ్వనాథ్ ఏదో వ్యాపారం మొదలెట్టాడట కదా? అగ్రహారంలో పుట్టి అదేం పనిరా..” అన్నాడు వంగిపోయిన నడుంతో వచ్చిన చిదంబర శాస్త్రి.
“బతకడానికి సవాలక్ష పనులున్నాయి గానీ.. మన కులానికి తలవంపులు తెచ్చే పనేంట్రా..” అన్నాడు పతంజలి శాస్త్రి కుర్చీలో కూర్చుంటూ..
రమణశాస్త్రి నిశ్శబ్దంగా వున్నాడు.
అవమానం భరించలేనట్లు.. మహాలక్ష్మి వంటింటి లోపలికెళ్ళింది.
“ఇంకా పెండ్లి కావల్సిన వాడు. ఇలాంటి వ్యాపారాలు చేస్తే వాడికి పిల్లనెవడిస్తాడురా..” అన్నాడు రఘురామయ్య పంతులు.
“అసలే మనది సాంప్రదాయ కుటుంబం. నువ్వు గాయత్రీ ఉపాసకుడివి. నీ కడుపున ఇలాంటోడు పుట్టాడేమిట్రా ..” మళ్లీ ఆయనే అన్నాడు.
“ఇప్పటికే మన కులం ఆడపిల్లలు పంచె కట్టుకొని గుడిలో పూజలు చేసే పురోహితుల్నే పెండ్లి చేసుకోం అంటుంటే.. ఇంకా వీడు ఇలాంటి పని చేస్తానంటే ఒప్పుకొంటావేంట్రా..?” పంచాంగాలు చూసే పరంధామశాస్త్రి కొంచెం కోపంగానే అన్నాడు.
“విశ్వనాథ్ ఇంట్లో ఉంటే పిలువరా రమణ.. మేమైనా చెప్పిచూస్తాం..” అని అడిగాడు నరహరి.
“లేడు.. బయటికెళ్ళాడు. నేనూ మీలాగే చెప్పిచూశాను” అవమానంతో రమణశాస్త్రి గొంతు వణికింది.
కట్టె ఊయల గొలుసును బిగపట్టుకున్నాడు.
కండ్లల్లో నిప్పుల చారలు పాకాయి. మొహం ఎర్రగా అయింది.
“మాకైతే ఒళ్ళు జలదరిస్తోంది. ఇంతటి జుగుప్సాకరమైన పనిచేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందిరా వాడికి..” నిలదీసినట్టే అడిగాడు చిదంబరశాస్త్రి. వంటింట్లోంచి మహాలక్ష్మి ఏడుపు సన్నగా వినిపిస్తున్నది.
రమణశాస్త్రి కండ్లలో సన్నటి నీటితెర కదిలి వచ్చింది.
అంతా అదేదో చావు వార్త విన్నట్టు నిశ్శబ్దమైపోయారు.
అప్పుడే ల్యాండ్ ఫోన్ రింగయింది.
రమణశాస్త్రి లేచివెళ్ళి క్రెడిల్ ఎత్తాడు. అవతల్నించి..
“ఏరా రమణా.. బాగున్నావా?” తన చిన్నప్పటి స్నేహితుడు, ఒకప్పుడు ‘చిల్వాకోడూర్’ దొర కొడుకు.
“నర్సింగ్.. బాగున్నారా.. హైదరాబాద్ నుంచేనా..?” తడబడుతూ అడిగాడు రమణశాస్త్రి.
“ఎల్లుండి నాన్నగారి 30వ సంవత్సరీకంరా.. నువ్వేకదా ప్రతి సంవత్సరం కర్మకాండ చేసేది. నువ్వు జూబ్లీ బస్టాండ్ కొచ్చి ఫోన్ చేస్తే.. నేను రిసీవ్ చేసుకుంటాను”
“తప్పకుండా వస్తానురా..”
“పొద్దుటే వచ్చి.. నాకు ఫోన్ చేయి..”
ఫోన్ పెట్టేసి మౌనంగా ఉన్నాడు రమణశాస్త్రి.
“ఎవర్రా ఆ ఫోను.. నర్సింగరావ్ దొరనా..” అడిగాడు పురంధరశాస్త్రి.
“అవును.. వాళ్ళ నాన్నగారిది 30వ సంవత్సరీకమట! హైదరాబాద్ రమ్మంటున్నారు” అన్నాడు రమణశాస్త్రి.
“చూశావా.. నీకు ఎంతగొప్ప పరిచయాలున్నాయో. అలాంటిది.. విశ్వనాథ్ నీ పరువు, మన కులం పరువు తీస్తే ఏం బావుంటుంది..”
“నేను.. వాళ్ళమ్మ చాలా చెప్పి చూశాం. వాడు వినట్లేదు. అంతా మా ఖర్మ..”
‘సత్కర్మ భిశ్చ సత్ఫలితం
దుష్కర్మ ఏవ దుష్ఫలం
అచ్యుత్కట పుణ్య పాపానం
సత్యం ఫలానుభవ మిహం ’.. అన్న శ్లోకాన్ని తనలో తానే గొణుక్కుంటూ వచ్చి ఊయలలో కూర్చున్నాడు.
విశ్వనాథ్ బయటనించి రాగానే.. నచ్చజెప్పాలని పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారు వాళ్లంతా.
కోపంగా వెళ్ళిన విశ్వనాథ్ ఇంకా రాలేదు.
చీకటి పడుతుండటంతో నిదానంగా లేచారు. రమణశాస్త్రి వాళ్ళని గుమ్మం వరకు సాగనంపాడు.
మహాలక్ష్మి మానసికంగా కుంగిపోయి.. వంటింట్లోంచి బయటకి రాలేదు.
***
రమణశాస్త్రిని రిసీవ్ చేసుకోడానికి నర్సింగ్రావు బస్టాండ్కి వచ్చాడు. బస్సు దిగిన వెంటనే మిత్రున్ని గాఢంగా హత్తుకొని కారెక్కించుకొని బయలుదేరాడు.
“ఏంట్రా.. మనూరి విశేషాలు?” అడిగాడు నర్సింగ్రావు.
రమణశాస్త్రి ఏం మాట్లాడలేదు. ముభావంగా కూర్చున్నాడు.
“ఏమైందిరా రమణా.. వచ్చినప్పట్నుంటి చూస్తున్నాను. ఏదో దిగులుగా ఉన్నావ్. నాక్కూడా చెప్పకూడనిదా..” అన్నాడు నర్సింగ్రావు కార్ డ్రైవ్ చేస్తూ..
“ఏం లేదులే. అయినా ఊరు విడిచి 30 యేండ్లవుతున్నది. ఏదెలా ఉంటే నీకెందుకురా..” చిరునవ్వుని పులుముకొని అన్నాడు రమణశాస్త్రి.
“నాన్నను 30 యేండ్లకింద నక్సలైట్లు చంపినప్పుడు చిన్న పిల్లలం. మనూరి జ్ఞాపకాలు ఇంకా గుర్తొస్తాయి. నేను రంగారావు దొర కొడుకునని నన్ను మీరంతా ప్రత్యేకంగా చూసేవారు కదా. నా మనసులో ఇంకా ఆ జ్ఞాపకాలు ఎండిపోలేదు..” అన్నాడు.
రమణశాస్త్రి భారంగా నిట్టూర్చాడు.
“మన బోడగుట్ట ఎలా ఉందిరా? పోశమ్మ కాడి చెరువు, అందులోని కొంగ బాగున్నాయా? ఎలుక బాయి, చిలుకవాగు, పోద్దాటి కల్లు, ఎల్లమ్మ గుడి, పీరీల గుండం, ఊడలమర్రి, మల్లన్న జాతర, కాట్రేగుల పండుగ, రామల్కపండు, నాగేటి సాల్లు.. ఎలా ఉన్నాయి రా..?” అని అడిగాడు నర్సింగ్రావు. మళ్లీ ఆయనే అందుకొని..
“భైరుపులపాట, అయ్యగారి పద్యం, పెద్ద పిట్ట అరుపు నాకింకా వినిపిస్తున్నాయి. నెత్తిమీద బోనం, సారవ్వ పూనకం, బొడ్డెమ్మల ఆట, బత్తీసుల దండ, డప్పుల సప్పుడు నా చెవుల్లో ఖంగుమంటున్నాయి. జెమ్మికింది రాత, బెల్లంపూస ముద్ద, మొలకమండే, సట్టి తీర్థం, మట్టి గాజులు, సాంచెల చప్పుడు ఇంకా విన్పిస్తున్నాయి. తెలకపిండి రుచి, బొమ్మలకొండ, గన్నేరు పూలు, ఎర్రటి ధూళి, అంబా అనే పిలుపు, చింతాకు పులుపు యాదికొస్తే ఇంకా నోరూరుతుంది. ఇవన్నీ ఏ పార్క్లో దొరుకుతాయి రా? ఏ పబ్లో కనిపిస్తాయి? ఏ ఐమ్యాక్స్లో వినిపిస్తాయి?” అన్నాడు.
“ఇప్పుడు అవేవీ లేవుగానీ, నీకు బాగా గుర్తున్నాయి రా..” అన్నాడు రమణశాస్త్రి నవ్వుతూ, మనసుని తేలిక పర్చుకొని..
“ఎంతైన చిన్నప్పటివి కదా.. అవునూ విశ్వనాథ్ ఎలా ఉన్నాడు?” అనడిగాడు నర్సింగ్రావు.
“వాడే మాకు, మా కులానికీ సమస్యయ్యాడు..” అన్నాడు అసహనంగా కదులుతూ..
“మీకు.. మీ కులానికా..?”
“అవును..” అంటూ బాధగా మొత్తం వివరించాడు రమణశాస్త్రి.
అంతా విని.. “ఇది సమస్యా..?” తేలిగ్గా నవ్వాడు నర్సింగ్రావు.
కొంచెం దూరం వెళ్లాక, రోడ్డు పక్కనే ఉన్న ఒక పెద్ద షోరూం దగ్గర కారు ఆపాడు.
“పాదరక్షలు.. గొడుగులు తీసుకుంటావా? దానమివ్వడానికి..” అడిగాడు రమణశాస్త్రి.
“కాదు.. ఇది నాదే..”
కారు దిగుతున్న రమణశాస్త్రి నిర్ఘాంతపోయాడు.
వెలిగిపోతున్న లైట్లలో.. మెరిసిపోతున్న చెప్పులు, బూట్లు..
షోరూం లోపలికి వెళ్తూ చెబుతున్నాడు నర్సింగ్రావు.. “ఇప్పుడు చెప్పు. నాదేం కులం. నేను చేస్తున్న పనేంటి? పనివాళ్ళు లేనప్పుడు కస్టమరొస్తే, వాడి కాలికి నేనే చెప్పు తొడుగుతా.. రమణా! మనం చేసే పని ఇతరులకు హాని కలిగించక పోతే చాలు. సంసారాల్ని ఛిద్రం చేసి సమాజాన్ని చెడగొట్టే వైన్ షాపులకన్నా.. నీ కొడుకు చేయాలనుకున్న పని చాలా గొప్పదిరా. రోడ్డుకు అటు పక్కన చూడు. పట్టపగలే లైట్లతో ధగధగా మెరిసిపోతున్న బ్యూటీ పార్లర్. అది నడిపేది ఎవరో తెలుసా? మిర్జాపూర్ సంస్థాన దొరసాని మనవరాలు. ఆమె కులానికి.. ఆమె చేసే హెయిర్ కటింగ్ పనికి సంబంధంలేదే! రా.. కారెక్కు.. నీకింకా చూపిస్తాను”
షోరూం బయటకొచ్చిన రమణశాస్త్రి కారెక్కాడు.
“మన జిల్లాలోనే ఉన్న రాజంపేట గడీ శేఖర్రెడ్డి దొర కొడుకు ఏం చేస్తున్నాడో తెల్సా? తెల్ల పందుల్ని పెంచుతున్నాడు. ఇదిగో ఆ షాప్ ఇదే”
రోడ్ పక్కన కారాపి షాప్ని చూపించాడు..
“మరి వాడి కులం ఏంటీ? చేస్తున్న పనేంటి? పనివాళ్ళతో సమానంగా వాడూ పనిచేస్తాడు. వాటిని కోసి అమ్ముతాడు. వాటి ధర కిలో 800 రూపాయలు”
నర్సింగరావ్ మళ్ళీ కారును పోనిచ్చాడు.
“రమణా.. నీకిప్పుడు కరోనా కంటే భయంకరమైన ఒక ఆకలి దృశ్యాన్ని చూపిస్తాను. ఆ చౌరస్తా వైపు చూడు..” అన్నాడు నర్సింగ్రావు.
అక్కడ దాదాపు 15 మంది వరకు పురోహితులు..
మాటిమాటికీ జంధ్యాలను సరిజేసుకుంటూ వచ్చేపోయే వారిని ఆశగా చూస్తున్నారు. అందులో అన్ని వయసుల వారూ ఉన్నారు.
“ఎవరైనా.. ఏదైనా వ్రతం చేసుకుంటేనో.. పిండప్రదానాలు చేసుకుంటేనో.. ఇక్కడికొచ్చి తీసుకెళ్తారు..”
ఇంతలో ఒకతను వచ్చాడు.. అందరూ అతన్ని చుట్టుముట్టారు.
రమణశాస్త్రి కండ్లు తడితడి అయ్యాయి.
కారు మళ్ళీ స్టార్టయ్యింది.
“రమణా.. అటు చూడు.. డ్రై క్లీనింగ్ షాప్. దాంట్లో కొన్ని వందల మిషిన్లు పనిచేస్తాయి. బెడ్ షీట్లు, ఆఫ్రాన్లు ఉతికేస్తారు. నాలుగైదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో మాట్లాడుకొని ఈ దుకాణాన్ని నడుపుతున్నది రమేష్ గుప్తా కోడలు. వీళ్ళెవరూ కులాన్ని నమ్ముకోలేదు. పనినే ఛాలెంజ్గా తీసుకొని జీవితాల్నే గెలుస్తున్నారు. ఈ పని చాకలి పని. ఆ పని మంగళి పని. ఇంకొకటి మంత్రసాని పని.. అంటూ కూర్చోవట్లేదు. మార్పు అనే గుర్రం మీద దౌడు తీస్తున్నారు”
రమణశాస్త్రి ఏమీ మాట్లాడలేదు.
ఇంతలో నర్సింగ్రావు ఇల్లొచ్చింది. అప్పటికే ఆయన భార్య పిండప్రదానానికి కావాల్సినవి సర్దిపెట్టింది. కాళ్ళు కడుక్కొని పీటలమీద కూర్చొని కార్యక్రమం ముగించాడు రమణశాస్త్రి.
సాయంత్రం మళ్ళీ రమణశాస్త్రిని బస్టాండ్లో దింపి, ఆప్యాయంగా చేతిని నొక్కి..
“రమణా.. నీ భయం.. ఆందోళన.. ఆవేదన.. బెంగను నేనర్థం చేసుకోగలను. అగ్రవర్ణాలు తమదికాని వృత్తిని తమ చేతుల్లోకి తీసుకునేముందు ఎంతటి క్షోభకు గురవుతారో నాకు తెలుసు. 27 ఏండ్ల కింద షూ షోరూం ప్రారంభించినప్పుడు.. మొదటిసారి కస్టమర్ కాళ్ళకు చెప్పులు తొడిగినప్పుడు.. నాకూ కన్నీళ్ళొచ్చాయి. కులాన్ని తిట్టుకున్నాను. కానీ, వృత్తిని కాదు..” అన్నాడు నర్సింగ్రావు.
రమణశాస్త్రి కడుపుబ్బరం అనిపించి టాయిలెట్కి వెళ్లొచ్చాడు.
“రమణా.. దేశమంతా ప్రతి బస్టాండ్లో కనిపించే సులభ్ కాంప్లెక్స్ టాయిలెట్స్ నిర్మించిన బిందేశ్వర్ పథక్ కులం ఏంటో తెలుసా? బ్రాహ్మణ కులం. పథక్ సోషియాలజీ చదువుకున్న ఉన్నత విద్యావంతుడు. బీహార్ రాష్ట్రంలో ఓ చిన్న గ్రామంలో పుట్టాడు. ఒకసారి ఒకాయన ఎర్రటి చొక్కా వేసుకొని పొలానికెళ్తుంటే ఒక ఎద్దు అతన్ని పొడవడానికి వచ్చింది. కొందరు అతన్ని కాపాడటానికి వెళ్ళి ఎద్దును తరిమికొట్టారు. అప్పటికే ఎద్దు కుమ్మడంతో అతను కింద పడిపోయాడు. అతన్ని లేపడానికి వచ్చిన వాళ్ళలో ఒకడు ‘అరే.. వీడు సఫాయోడురో’ అని అరిచేసరికి అందరూ దూరంగా పరిగెత్తారు. అది గమనించిన బిందేశ్వర్ పథక్ ఆ అంటరాని వాడి శరీరానికి అంటిన దుమ్ము దులిపేశాడు. కానీ, అప్పటికే అతను చనిపోయాడు. ఈ విషయం ఆనోటా ఈనోటా అగ్రహారం దాకా చేరింది. పథక్ను శిక్షించాలని జాతకాలు చెప్పే వాళ్ళ నాన్నను అగ్రహారం పెద్దలు కోరారు. దాంతో వాళ్ళ నాన్నమ్మ పథక్కి ఆవు పేడ తినిపించి, ఆవు మూత్రం తాగించి చలికాలం తెల్లవారుజామున గంగనీళ్ళతో స్నానం చేయించింది. ఆ సంఘటనలతో చలించిపోయిన అతడు సులభ్ కాంప్లెక్స్ నిర్మించడానికి పూనుకున్నాడు. ఇప్పుడు మోడ్రన్ టెక్నాలజీ వచ్చి వృత్తులన్నీ పరాయీకరణం చెందాయి. కానీ, కులాలు మాత్రం ఇంకా బలపడ్డాయిరా..” అన్నాడు. రమణశాస్త్రి ఎక్కిన తర్వాత బస్సు బయల్దేరింది.
***
“అంకుల్.. టిక్కెట్..” అంది లేడీ కండక్టర్.
ఏదో దీర్ఘాలోచనలో ఉన్న రమణశాస్త్రి ఉలిక్కిపడ్డాడు.
ఆ వెంటనే తేరుకొని..“జగిత్యాల” అన్నాడు.
ఆ లేడీ కండక్టర్ను చూడగానే చప్పున
‘అరుంధతి’ గుర్తొచ్చింది.
అరుంధతి..
తన ఒక్కగానొక్క కూతురు. పెండ్లయిన ఆర్నెల్లకే మృత్యువాత పడిన బిడ్డ. తను చనిపోయేటప్పటికే నాలుగు నెలల గర్భవతి. అప్పటికీ విశ్వనాథ్కు పదమూడేండ్లు.. ఆ రోజు తనతో.. తమ్ముడితో చెప్పుకోలేక వాళ్ళమ్మతో చెప్పుకుంది.
“మన బాయి పాయిఖాన నిండిపోయిందే అమ్మ.. దాన్ని తోడేయించుమని నాన్నకి చెప్పమ్మా..” అని.
మహాలక్ష్మి తనకు ఆ మాట చెప్పగానే సఫాయి రాజిగానింటికి స్వయంగా వెళ్ళి చెప్పాడు. వాడు దొడ్డుప్పు, బొగ్గులు తెచ్చి దాంట్లో పోశాడు.
“అది రెండ్రోజుల్లో మట్టిలెక్క అయితది బాంచెన్.. అప్పుడు ఆ మట్టిని తట్టల్తో తోడేస్తం. ఎట్లనన్న ఓర్చుకోండ్రి. రెండ్రోజులు ఎవరింటికైన వెళ్ళండి” అని చెప్పి వెళ్లాడు.
అప్పటికీ.. ఎవరింట్లో లెట్రిన్లు లేవు.
కానీ.. ఓరోజు అరుంధతి చెంబు తీసుకుని బిక్కుబిక్కుమంటూ.. వాగొడ్డుకు పోయింది.
అక్కడే సర్కార్ తుమ్మ పొదల మాటున ఉన్న అయిదారు ఊరకుక్కలు.. ఒక్కసారిగా
మీదపడ్డాయి.
తను అరుస్తూ.. ఆయాసంతో భయంగా పరిగెత్తుకొచ్చింది.
వేటగాడిలా వెంటాడాయి.. అందిన చోటల్లా కరిచాయి..
కాళ్ళు, చేతులు రక్తసిక్తమయ్యాయి. చీర, జాకెట్టు పీలికలైపోయాయి. అటుగా వెళ్లిన కొందరు కుక్కల్ని తరిమికొట్టారు.
గాయపడ్డ అరుంధతికి అప్పుడు నాలుగో నెల. వైద్యం ఫలించలేదు. ఉలిక్కిపడుతూనే మూడో రోజు కన్ను మూసింది.
మహాలక్ష్మి హృదయ విదారకంగా ఏడ్చింది. తన గుండె చెరువయ్యింది. విశ్వనాథ్ బిక్కచచ్చిపోయి నెల రోజుల వరకూ కోలుకోలేదు.
ఈ సంఘటన జరిగి పదేండ్లవుతున్నది. చెరిగిపోని అరుంధతి రూపం.. ఆ కండక్టరు అమ్మాయిని చూడగానే కన్నీరు కప్పేసి చెదిరిపోయింది.
“టికెట్.. టికెట్.. టికెట్..” అంటూ హ్యాండిల్ రాడ్ని లేడీ కండక్టర్ క్లిప్తో కొట్టడంతో.. రమణశాస్త్రి ఈ లోకంలోకి వచ్చాడు.
బస్సు జగిత్యాల చేరేసరికి రాత్రి పదయింది.
***
ఇల్లు నిశ్శబ్దంగా ఉంది.
రమణశాస్త్రి గంగాళంలోని నీళ్ళతో కాళ్ళు కడుగుతుంటే.. మహాలక్ష్మి వంటింట్లోంచి వచ్చింది.
విశ్వనాథ్ భయం భయంగా తన గదిలోంచి వచ్చాడు.
విశ్వనాథ్ని చూసి.. రమణశాస్త్రి నిండుగా నవ్వాడు.
కాళ్ళు తుడుచుకోకుండానే కొడుకుని ఆలింగనం చేసుకున్నాడు.
ఆనందంగా కొడుకు చేతిలో ఓ గిఫ్ట్ ప్యాకెట్ పెట్టాడు.
అది చూసి.. “నాన్న.. కొత్త సెల్ఫోన్..” అని సంతోషంగా అరిచాడు విశ్వనాథ్.
“ఫోన్ మాత్రమే కాదు.. సిమ్కూడా కొత్తదే..” అన్నాడు రమణశాస్త్రి చిరునవ్వుతో..
విశ్వనాథ్కు ఆ ప్యాకెట్లో ఏదో చీటీ కనిపించింది.
దాన్ని చేతిలోకి తీసుకొని మడత విప్పాడు.
‘మీ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిండినదా…
అయితే.. నూతన పద్ధతిలో తోడివేయ
బడును.
అరుంధతి ట్యాంక్ క్లీనర్స్.
వివరాలకు సంప్రదించండి..
సెల్ : 987….123’
గుండె నిండా శ్వాస పీల్చుకుని రమణశాస్త్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు విశ్వనాథ్.
***
నాలుగేండ్ల తర్వాత ఢిల్లీలో.. ఓ పెద్ద హాలులో.. దేశ ప్రధానమంత్రి తన పేరు పిలవటంతో..
ఎనిమిది వేలమంది ఒక్కసారిగా చప్పట్లు కొట్టడంతో.. ఆ జ్ఞాపకాల్లోంచి బయటపడ్డాడు విశ్వనాథ్.
“అధునాతన యంత్రాంగంతో.. ఆరు వందలమందికి ఉపాధి కలిపించి, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్గా ఎదిగి.. దాంతో బయోగ్యాస్ని, సేంద్రియ ఎరువుల్ని సృష్టించిన అభినవ సైంటిస్ట్ అయిన విశ్వనాథశాస్త్రి గారిని ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డు అందుకోవల్సిందిగా కోరుతున్నాం..”
ప్రధాని స్వయంగా ప్రకటించడంతో.. వేదిక మెట్లు ఎక్కి కన్నీళ్ళతో చూస్తే.. తండ్రి, తల్లి మసక మసకగా కనపడ్డారు.
కానీ, ప్రధాన మంత్రి అందజేసిన అవార్డు నిండా.. అక్క ‘అరుంధతి’ నవ్వుతూ కనిపించింది విశ్వనాథ్కు.
(బ్రాహ్మణ సోదరులకు క్షమాపణలతో.. ఒక యథార్థ సంఘటన ఆధారంగా..)