హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): మురుగునీటి కాల్వలు (మ్యాన్హోల్స్), సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసేందుకు మనుషులకు బదులుగా యంత్రాలను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గత నవంబర్లో విసిరిన ‘సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్-2021’లో దేశవ్యాప్తంగా 243 నగరాలు పాల్గొంటున్నాయి. తెలంగాణ నుంచి ఏడునగరాలు ఈ పోటీకి ఎంపికయ్యాయి. విషపూరితమైన మ్యాన్హోల్స్, సెప్టిక్ ట్యాంకులను శుభ్రంచేసే క్రమంలో విషవాయువులను పీల్చి కార్మికులు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియలో యంత్రాలను ప్రవేశపెట్టాలని కేంద్రం సూచించింది. యాంత్రీకరణను చేపట్టి విజయవంతంగా అమలుచేస్తున్న నగరాలకు రూ.52 కోట్ల వరకు నగదు బహుమతిని ప్రకటించింది. రాష్ట్రం నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం, నిజాంపేట్ పోటీపడుతున్నాయి. పారిశుద్ధ్య పనుల్లో ఉపయోగించేందుకు ఈ నగరాల కోసం పలు యంత్రపరికరాలను, వాహనాలను కొనుగోలు చేయనున్నారు. పోటీ పాల్గొంటున్న నగరాలలో వచ్చే ఏప్రిల్ చివరి నాటికి యాంత్రీకరణ పూర్తికావాలి. ఏప్రిల్ 20కల్లా డాక్యుమెంట్స్ ఆప్లోడ్ చేయాలి. మే 1 నుంచి జూన్ 30 వరకు విశ్లేషణ జరిపి, ఆగస్టు 15న ఫలితాలను ప్రకటిస్తారు. రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాలలో ఇప్పటికే ప్రభుత్వం భూగర్భ మురుగునీటి కాల్వలను, మ్యాన్హోల్స్ను, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసేందుకు యంత్రాలు, వాహనాలను వినియోగిస్తున్నది.