న్యూఢిల్లీ : దేశంలో కరోనా టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. 76 రోజుల్లో 6.75 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గురువారం ఒకే రోజు రాత్రి 8 గంటల వరకు 17,47,094 మోతాదులను ఇచ్చినట్లు పేర్కొంది. జనవరి 16న ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేయడంతో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఫ్రంట్లైన్ కార్మికులు, మార్చి నుంచి 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 45 ఏళ్లు దాటి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ కేంద్రం టీకాలు వేస్తోంది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6,75,36,392 మోతాలు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. ఇందులో 88,48,558 మంది ఆరోగ్య కార్యకర్తలకు మొదటి డోసు, 52,63,108 రెండో డోసు.. ఫ్రంట్లైన్ వర్కర్లలో 93,99,776 ఫస్ట్ డోస్.. 39,18,646 మందికి సెకండ్ డోస్ వేసినట్లు చెప్పింది. అలాగే 45 ఏళ్లు పైబడిన 4,01,06,304 లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేశారు. గురువారం రాత్రి 8గంటల వరకు 17,47,094 డోసులు వేయగా.. 16,20,746 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 1,26,348 మందికి రెండో డోసు వేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది.